కంది, ఏప్రిల్ 13 : సంగారెడ్డిలో ఇకపై ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఇట్టే పసిగట్టే అవకాశం ఉంది. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా పట్టణంలోని పలు ప్రధాన కాలనీలతో పాటు మెయిన్రోడ్డులోని కలెక్టరేట్ నుంచి వైకుంఠపురం వరకు పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలను అమర్చుతున్నారు. మరో వారం పది రోజుల్లో వీటిని ప్రారంభించనున్నారు. దాతల సహకారంతో మొత్తం 227 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా, ఇందులో 70 శాతం వరకు ఇప్పటికే పని చేస్తున్నాయి. మిగితా వాటిని కూడా త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
కొత్తగా 227 సీసీ కెమెరాలు…
జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ఆయా కాలనీలకు చెందిన దాతల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తుంది. ఇందులో భాగంగా నెల రోజుల క్రితం నుంచి సంగారెడ్డిలోని ఆదిత్యనగర్ కాలనీలో 32, సప్తగిరి కాలనీ 33, వసంత్నగర్కాలనీ 20, బైపాస్ రోడ్డులోని బీవీఎం చౌరస్తా వద్ద 6, కల్వకుంట 10, నారాయణరెడ్డి కాలనీ 20, శాంతినగర్ 17, బృందావన్కాలనీ 25, రాజంపేట చౌరస్తాలో 4 కెమెరాలను ఏర్పాటు చేయించారు. ఇవన్నీ ప్రస్తుతం పని చేస్తున్నాయి. మిగతా చోట్ల కూడా దాతల సహకారంతో మరిన్ని ఏర్పాటు చేయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పట్టణ పోలీసులు తెలుపుతున్నారు.
కలెక్టరేట్ టు వైకుంఠపురం….
గతంలో సంగారెడ్డి చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు కొన్ని సీసీ కెమెరాలను ఉండగా, అవి పాతవి కావడంతో పాటు సాంకేతిక సమస్యల కారణంగా పని చేయడం లేదు. దీంతో ఎస్పీ సూచనల మేరకు దాతల సహకారంతో కలెక్టరేట్ నుంచి వైకుంఠపురం వరకు కొత్తగా 60 కెమెరాలను ఏర్పాటు చేయించనున్నారు. రోడ్డుపై ఉన్న ఎల్ఈడీ స్తంభాలకు ఇవి బింగించారు. వారం పది రోజుల్లో వీటిని అధికారికంగా ప్రారంభించనున్నట్లు సీఐ వెంకటేశ్, ఎస్ఐ ప్రసాద్లు తెలిపారు. ఇక చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసే వీలు ఉంటుందని, ఈ సీసీ పర్యవేక్షణ మొత్తం పట్టణ పోలీస్ స్టేషన్తో పాటు జిల్లా పోలీసు కార్యాలయానికి అనుసంధానంగా పని చేస్తాయని పేర్కొన్నారు.
నిఘాను పటిష్టం చేసేందుకే..:బి. రమేశ్, సీఐ, సంగారెడ్డి పట్టణం
సంగారెడ్డిలో నిఘా వ్యవస్థను మరింత పటిష్ట పరిచేందుకే కొత్తగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. సంగారెడ్డి మెయిన్ రోడ్ అయిన కలెక్టరేట్ నుంచి వైకుంఠపురం వరకు కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా దాతల సహకారంతో 60 సీసీ కెమెరాలను అమర్చుతున్నాం. త్వరలోనే వీటిని ప్రారంభిస్తాం. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం. శాంతిభద్రతలు కాపాడడంలో సీసీ కెమెరాలు ఎంతో దోహదపడుతాయి.