సంగారెడ్డి, జూన్ 11 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్(ఫుడ్ పార్కు) ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. అందోల్ నియోజకవర్గంలోని 65వ నంబర్ జాతీయ రహదారి పక్కన లింగంపల్లి, కంకోల్ గ్రామాల్లో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్(ఫుడ్ పార్కు) ఏర్పాటు కోసం 128.38 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ భూములను టీఎస్ఐఐసీకి అప్పగించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. మరో 50 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పగించేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫుడ్పార్కు జోన్ ఏర్పాటుకు మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.
భూముల గుర్తింపు ప్రక్రియ వేగవంతం
తన నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేయాలని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ గతంలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావుకు విన్నవించారు. అవసరమైన భూముల గుర్తింపు ప్రక్రియలో ఆయన చొరవ తీసుకున్నారు. అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో నగేశ్తో కలిసి ప్రభుత్వ భూములను గుర్తించారు. మునిపల్లి మండలం లింగంపల్లి, కంకోల్ గ్రామాల్లో సర్వే నెంబరు 108, 219, 198, 212లో మొత్తం 128.38 ఎకరాల ప్రభుత్వభూమి అనుకూలంగా ఉండడంతో టీఎస్ఐఐసీకి అప్పగించనున్నారు. దీంతోపాటు అదనంగా మరో 50 ఎకరాల భూమి అప్పగింతకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జోగిపేట సమీపంలో 50 ఎకరాల ప్రభుత్వభూములను గుర్తించినప్పటికీ, ఆ భూములపై కాంగ్రెస్ పార్టీ నాయకులను కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చారు. కల్హేర్ మండలం వెంకటాపూర్లో సైతం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం రెవెన్యూ అధికారులు 486 ఎకరాల ప్రభుత్వభూమిని గుర్తించారు.
యువతకు ఉపాధి, రైతుకు మేలు..
ఫుడ్ ప్రాసెసింగ్ జోన్(ఫుడ్ పార్కు) ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి లభించడంతో పాటు రైతులకు మేలు జరుగనున్నది. ఏ పంట ఎక్కడ పండితే అక్కడే వాటికి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. దీంతో రైతులు పండించిన పంటలకు డిమాండ్ పెరుగనున్నది. వ్యవసాయ ఉత్పత్తులు, డెయిరీ, మాసం ఉత్పత్తుల ఆధారంగా ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ జోన్(ఫుడ్ పార్కు)లను ఏర్పాటు చేస్తున్నది. సంగారెడ్డిలో ఏర్పాటు చేసే స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో వ్యవసాయ, పండ్లు, బెయిరీ, మీట్ ఉత్పత్తుల ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు వీలుంది. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి సంగారెడ్డిలో వరి, పత్తి, కంది పంటలు ఎక్కువగా పండుతాయి. జిల్లాలో త్వరలోనే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు కానుండడంతో జిల్లాలో వరి సాగు గణనీయంగా పెరిగే అవకాశమున్నది. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో మొదటగా రైస్ ఆధారిత యూనిట్ల ఏర్పాటుకు అవకాశమున్నది. అదేవిధంగా జిల్లా రైతాంగం టమాట, ఆలుగడ్డ్డ(బంగాళ దుంప), పసుపు, అల్లం పండిస్తారు. టమాటను ప్రాసెసింగ్ చేసి పచ్చళ్లు, టమాట సాస్, కెచప్ తయారీ యూనిట్లతో పాటు అలుగడ్డకు సంబంధించి స్నాక్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేసే అవకాశమున్నది. జహీరాబాద్లో రైతులు ఎక్కువగా అల్లం పండిస్తారు. అల్లాన్ని శుద్ధ్దిచేసి వాటితో పచ్చళ్లు తయారు చేసే కంపెనీలు ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో ఏర్పాటు చేసేందుకు వీలు ఉంది. జిల్లాలో మామిడి, జామ పండ్లు ఎక్కువగా పండుతాయి. మామిడి, జామను శుద్ధ్దిచేసి వాటతో జ్యూస్లు, జామ్, స్నాక్బార్లు తయారుచేసే యూనిట్లు రావచ్చు. దీంతో జిల్లాలో వరి, పత్తి నిల్వ చేసే సమస్య తీరుతుంది.
వర్గల్లో ఫుడ్ పార్కు ఏర్పాటు
గజ్వేల్, జూన్11: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని వర్గల్ మండల కేంద్రంలో ప్రభుత్వం 900 ఎకరాల విస్తీర్ణంలో ఫుడ్ పార్కు ఏర్పాటు చేయనున్నది. జిల్లాలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలు స్థాపిస్తే రైతులకు లబ్ధ్ది చేకూరడమే కాకుండా నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు వర్గల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో పత్తి, మొక్కజొన్న, వరి, వేరుశనగ, కంది, పెసర, శనగ, కూరగాయలు, స్వీట్కార్న్ పంటలు రైతులు ఎక్కువగా సాగుచేస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు అవసరమైన పంట ఉత్పత్తులు ఇక్కడ లభిస్తాయి. దీనిద్వారా రైతుల పంట ఉత్పత్తులు మంచి ధరలకు పరిశ్రమలకు అమ్ముకొని ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు.
త్వరలో పనులు ప్రారంభం..
వర్గల్లో 900 ఎకరాల విస్తీర్ణంలో ఫుడ్ పార్కు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ తొలి ప్రాధాన్యతగా రైస్మిల్లులు, పప్పు మిల్లులు, ఆయిల్ మిల్లులతో పాలు పలు ఇతర పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అధికారులు భూసర్వే నిర్వహించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. 900 ఎకరాల భూములను త్వరలో పరిశ్రమల అభివృద్ధి సంస్థకు అప్పగించనున్నట్లు తెలిసింది.
నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు..
వర్గల్లో ఫుడ్ పార్కు ఏర్పాటుతో గజ్వేల్ నియోజకవర్గ నిరుద్యోగ యువతీయువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కొండపోచమ్మ సాగర్ ముంపు బాధితులకు ఏర్పాటు చేసిన తున్కిబొల్లారం ఆర్అండ్ఆర్ కాలనీ, మల్లన్నసాగర్ భూనిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన ముట్రాజ్పల్లి ఆర్అండ్ఆర్ కాలనీలకు మధ్యలో ఈ పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ముంపు గ్రామాల యువతతో పాటు గజ్వేల్, వర్గల్, ములుగు, మర్కూక్ తదితర మండలాల యువకులకు, అసంఘటిత రంగ కార్మికులకు ఉపాధి దొరికే అవకాశమున్నది. సిద్దిపేట జిల్లాలో వ్యవసాయరంగానికి, రైతులకు ఇబ్బంది కలగకుండా, ప్రజాజీవనానికి కాలుష్య సమస్యలు ఉత్పన్నం కాకుండా పరిశ్రమలు స్థాపించాలని సీఎం కేసీఆర్ కొన్నేండ్ల నుంచి ఆలోచిస్తున్నారు.
పరిశ్రమల ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి..
అందోలు నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. మునిపల్లి మండలం లింగంపల్లి, కంకోల్ శివారుల్లో 250 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. 65వ నంబరు జాతీయ రహదారి ఆనుకుని ఈ భూములు ఉన్నాయి. ఇక్కడే ఫుడ్పార్కు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావుకు విజ్ఞప్తి చేశాం. పరిశ్రమలతో ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
భూముల అప్పగింతకు చర్యలు..
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం మునిపల్లి మండలం లింగంపల్లి, కంకోల్ గ్రామాల మధ్య 128.38 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించాం. ఈ భూములు ఫుడ్ పార్కు ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయి. ఈ భూములను టీఎస్ఐఐసీకి అప్పగించేందుకు ప్రతిపాదనలు సిద్ధ్దం చేసి ప్రభుత్వానికి అందజేశాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే భూములను టీఎస్ఐఐసీకి అప్పగిస్తాం. ఈ గ్రామాల్లో మరిన్ని ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే వాటిని సైతం టీఎస్ఐఐసీకి అప్పగిస్తాం.