కంగ్టి, జూన్ 11: నియోజకవర్గంలో జొన్నల కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని నారాయణఖేడ్ ఏడీఏ కరుణాకర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని భీంరా, కంగ్టి, తుర్కవడగామ గ్రామాల్లో జొన్నపంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జొన్నరైతుల వివరాలను సేకరిస్తున్నట్లు వెల్లడించారు. రైతుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం నారాయణఖేడ్ ప్రాంతంలో జొన్నల కొనుగోలుకు అనుమతిచ్చిందన్నారు. త్వరలోనే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అనంతరం కంగ్టిలో ఎస్ఐ అబ్దుల్ఫ్రీక్, ఏవో ప్రవీణ్తో కలిసి ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జొన్నల వివరాల నమోదుకు సహకరించాలి
కల్హేర్, జూన్ 11: జొన్న వివరాల నమోదుకు రైతులు సహకరించాలని ఏవో శశాంక్ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో రైతుల ఇంటికి వెళ్లి జొన్నలు ఏ మేర ఉన్నాయో వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ రైతులు పండించిన జొన్నలను కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేస్తుందన్నారు. జిల్లాలో కల్హేర్ మండలంలో 2500 ఎకరాల్లో జొన్న పంటను సాగు చేశారని తెలిపారు. వ్యవసాయ అధికారులు రైతు ఇంటికి వచ్చినప్పుడు ఆన్లైన్ వివరాలు నమోదు చేసిన రైతుల జొన్నలనే కేంద్రంలో కొనుగోలు చేస్తారన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు సతీశ్, భాస్కర్, కృష్ణవేణి ఉన్నారు.
కొనసాగిన వివరాల నమోదు
వట్పల్లి, జూన్ 11: రైతులు పండించిన జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఈ మేరకు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ వట్పల్లిలో జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారని రైతు బంధు సమితి అధ్యక్షుడు అశోక్ గౌడ్, మండల వ్యవసాయ అధికారి మహేశ్ చౌహాన్ తెలిపారు. శుక్రవారం మెడుకుంద, పోతులబుగుడ తదితర గ్రామాల్లో జొన్నల వివరాలను నమోదు చేసుకోవడంతో పాటు వారి వద్ద నిల్వ ఉన్న జొన్నల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నర్సమ్మ యాదగిరి. ఏఈవో సవిత, నాయకులు రాజు, మల్లికార్జున్ పాల్గొన్నారు.