కరోనా సోకిన రోగులకు ఇంట్లో నుంచి తరుముతున్న రోజులివి. ఒక అభద్రతా భావం, భయానక వాతావరణంలో అయినవారే పట్టించుకునే పరిస్థితులు లేవు. ఇలా కొవిడ్ సంక్రమించిన వారికి మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ వినోద్కుమార్ మానవత్వంతో సేవలు అందిస్తు ముందుకుసాగుతున్నాడు. – బొల్లారం, మే 9
బొల్లారం మున్సిపల్ కార్యాలయంలో శానిటరీ ఇన్స్స్పెక్టర్గా వినోద్కుమార్ విధులు నిర్వహిస్తున్నాడు. మొదటి నుంచి కొవిడ్ సమయంలో ఫ్రంట్లైన్ వారియర్గా సేవలు అందించిన శానిటరీ ఇన్స్పెక్టర్ వినోద్కుమార్ ఓసారి కరోనా బారిన పడ్డారు. 14 రోజులు వైద్యుల సూచన మేరకు ఇంటివద్దే ఉంటూ ధైర్యంగా కొవిడ్ను జయించాడు. అనంతరం తనదైన శైలిలో ఫ్రంట్లైన్ వారియర్గా ముందుండి సేవలను అందిస్తున్నాడు.
విస్తృత సేవలు..
కొవిడ్ రోగులు ఉన్న వార్డుల్లో రసాయన మందులను పిచికారీ చేయడం, బ్లీచింగ్ పౌడర్తో పరిసరాలను శుద్ధి చేయడం వంటి పనులను నిర్వహించేలా కార్మికులను ప్రోత్సహిస్తూ వినోద్కుమార్ ఆదర్శవంతంగా నిలుస్తున్నాడు. ప్రభుత్వం చేపట్టిన కొవిడ్ సర్వేలో తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తూ కరోనా రోగుల కుటుంబాలకు మెడికల్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. వ్యాధికి భయపడకుండా రోగి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పిస్తూ ముందుకుసాగుతున్నాడు. ఆపద కాలంలో ఫ్రంట్లైన్ వారియర్గా నిలిచి నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజారోగ్యానికి అతడు అందిస్తున్న సేవలను అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు అభినందిస్తున్నారు.
ఇమ్యూనిటీతోనే జయించాలి..
కొవిడ్ నిబంధనలు పాటించాలి. వైద్యుల సహాయం తీసుకుని శరీరంలో ఇమ్యూనిటీ పవర్ను పెంచుకోవాలి. అప్పుడే దానిని ధైర్యంగా జయిస్తాం. నాకు కొవిడ్ వచ్చింది అనే భయాందోళన నుంచి ముందు బైటపడాలి. ప్రస్తుతం నేను కొవిడ్ రోగులకు సేవలు అందిస్తూ వారికి మనోనిబ్బరాన్ని కలిగించే ప్రయత్నం చేస్తు నా విధులను నిర్వర్తిస్తున్నాను. ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా భయం నుంచి బయటపడితే అన్నీ జయించినట్టే.
వినోద్కుమార్ శానిటరీ ఇన్స్పెక్టర్, బొల్లారం మున్సిపాలిటీ