పటాన్చెరు, జూలై 9: అభివృద్ధిలో ప్రతీ గ్రామం ఆదర్శం కావాలని, అందుకు చిట్కుల్ గ్రామం పల్లె ప్రగతికి ప్రతిబింబంగా నిలుస్తోందని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం పటాన్చెరు మండలంలోని చిట్కుల్ గ్రామంలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, బృహత్ పల్లె ప్రకృతి వనానికి భూమి పూజ చేశారు. అనంతరం పంచాయతీ పాలకవర్గం, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. గ్రామంలోని నర్సరీ, డంపింగ్యార్డు పారిశుధ్య నిర్వహణను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయని తెలిపారు. చెత్తతో ఎరువు తయారు చేస్తున్న ప్రక్రియ వందశాతం జరిగేలా ప్రజలు సహకరించాలని కోరారు. పాలకవర్గం, అధికారులు గ్రామాన్ని తీర్చిదిద్దిన తీరును అభినందించారు. ప్రతి గ్రామం కూడా ఇలాగే తయారు కావాలని సూచించారు. సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ పనితీరుపై ప్రశంసలు కురిపించారు. అంకితభావంతో పని చేసే మధు లాంటి సర్పంచులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని కలెక్టర్ అన్నారు.
చిట్కుల్ గ్రామం స్ఫూర్తి..
నగరాన్ని తలపించేలా గ్రామంలో అభివృద్ధి కనిపిస్తున్నదని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. రానున్న రోజుల్లో చిట్కుల్ గ్రామాన్ని రాష్ట్ర అధికారులు పెద్ద ఎత్తున సందర్శించే అవకాశం ఉందన్నారు. ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తున్నదన్నారు. గ్రామంలో పల్లె ప్రగతి విజయవంతం కావడంపై అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ పల్లె ప్రగతికి ముందు, ఆ తర్వాత అనేలా అభివృద్ధి కొనసాగుతోందన్నారు. పంచాయతీల్లో పల్లె ప్రగతి పనులను స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అప్పుడే గ్రామాలు సర్వాంగ సుందరంగ తయారు చేసుకోవచ్చన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని 13 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కరోనా సమయంలో సర్పంచ్, పాలకవర్గం ప్రజలకు అండగా నిలిచి అప్రమత్తంగా వ్యవహరించారని, థర్డ్వేవ్ రాకుండా ముందస్తు జాగ్రత్త వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.
రైతు బీమా చెక్కు అందజేసిన సర్పంచ్..
సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తల్లిదండ్రులు ఇటీవలే చనిపోగా, వారి పేరిట వచ్చిన రూ.10లక్షల రైతు బీమా చెక్కును గ్రామాభివృద్ధికి వినియోగించాలని కోరుతూ ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావుకు విరాళంగా అందజేశారు. గ్రామాభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తున్న సర్పంచ్ నీలం మధును ఉప సర్పంచ్ విష్ణువర్దన్రెడ్డిని పంచాయతీ కార్యదర్శి కవితను కలెక్టర్ ఘనంగా సన్మానించారు.
ప్రభుత్వ భూములు పరిరక్షించాలి..
గ్రామాల్లో ప్రభుత్వ స్థలాల పక్కన భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. భూముల పరిరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ భూములు ఎక్కడున్న వాటిని గుర్తించి స్వాధీనం చేసుకోవాలని తెలిపారు. నిబంధనలు అతిక్రమించి ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులు పెడతమన్నారు. జిల్లా వ్యాప్తంగా పల్లె ప్రగతిలో బాగా పని చేస్తున్న పంచాయతీల్లో చిట్కుల్ ముందంజలో ఉందని అడిషనల్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కార్యక్రమంలో సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాస్రావు, డీఎఫ్వో వెంకటేశ్వర్లు, డీపీవో సురేష్మోహన్, డీఎల్పీవో సతీష్రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, జడ్పీటీసీ సుప్రజా వెంకట్రెడ్డి, ఎంపీపీ సుష్మాశ్రీ వేణుగోపాల్రెడ్డి, ఎంపీటీసీలు, నాయకులు నారాయణరెడ్డి, రవీందర్రెడ్డి, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.