అమ్మ, నాన్నలు : నర్సింహ్మారెడ్డి-ఉమాదేవి
విద్యార్హత : ఇంటర్మీడియెట్
రాజకీయ ప్రస్థానం : 2019 పుల్కల్ జడ్పీటీసీగా టీఆర్ఎస్ నుంచి విజయం
భర్త : పట్లోళ్ల జైపాల్రెడ్డి, కుమారుడు : జయంత్రెడ్డి
ఆడజన్మ అనగానే ఇంటికి మహాలక్ష్మి లాంటిదని పురాతన కాలంలో పెద్దలు అనందంలో మునిగిపోయేవారు. నేటి ఆధునిక యుగంలో ప్రపంచం పరుగులు పెడుతున్నా, ఆడపిల్ల పుడితే అందోళన చెందుతున్నారు. బిడ్డకు జన్మనిచ్చింది మహిళే అని జ్ఞానం ప్రజల్లో కలగకపోవడం విడ్డూరం. తల్లి, చెల్లి, భార్య, అత్త, ఉద్యోగినిగా రాణిస్తున్నా వివక్ష మాత్రం తగ్గలేదు. తల్లి ఒకప్పటి మహిళేనని గుర్తించి సముచిత స్థానం కల్పించిన రోజే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. ఇప్పుడు ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని అన్నిరంగాల్లో మహిళలు తమ ప్రాధాన్యతను చాటిచెబుతున్నారు. మదర్స్ డే సందర్భంగా మహిళా లోకానికి నా శుభాకాంక్షలు.
సంగారెడ్డి, మే 8 :
మహిళతోనే ప్రపంచ సృష్టి జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. నేటి ఆధునిక యుగంలో సమాజంలో తల్లి పాత్ర వెల కట్టలేనిది. ముఖ్యంగా ఇంటికి అందం ఇల్లాలు అని కొలుస్తున్న సమాజం మనది. ఐదు పాత్రలు పోషిస్తూ తల్లి తన పాత్రను గౌరవంగా నిర్వహిస్తున్నది. తల్లి నుంచి చెల్లిగా, భార్యగా, అత్తగా, ఉద్యోగినిగా పాత్రలు పోషిస్తూ కుటుంబపోషణలో భర్తకు అండగా నిలుస్తున్నది మహిళ. తల్లిగా కన్నబిడ్డల ఆలనాపాలనా చూస్తూ పిల్లలను పెంచి పెద్దచేసే వరకు కంటికి రెప్పాలా కాపాడుకుని సంరక్షణ చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్నిరంగాల్లో అవకాశాలను కల్పిస్తున్నదని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి. మదర్స్ డే ను పురస్కరించుకుని ఆమె మనసులోని మాటలను తెలుసుకుందాం.
దివంగత నేత మాణిక్రెడ్డి సర్పంచ్ నుంచి ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు. అప్పటి నుంచి తమ కుటుంబం రాజకీయంగా ఎదిగింది. నా భర్త జైపాల్రెడ్డి అన్నకు అండగా రాజకీయంగా సహకరిస్తూ క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులు నిర్వహించడంతో అనుభవం పెరిగింది. బావ మాణిక్రెడ్డి డాకూర్ గ్రామ సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం జోగిపేట సమితి చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. మెదక్ ఎంపీగా, రాష్ట్ర ఇండస్ట్ట్రియల్ డెవలప్మెంట్, అటవీశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఆయన రాజకీయ వారసునిగా నా భర్త జైపాల్రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. 2019లో సీఎం కేసీఆర్ అవకాశం కల్పించడంతో పుల్కల్ జడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యాను. జడ్పీ చైర్పర్సన్గా అవకాశం ఇచ్చి జిల్లా బాధ్యతలు అప్పగించి మా బావగారి రాజకీయ ప్రస్థానానికి మలితరం అడుగులు పడ్డాయి. నా పెండ్లికి ముందే నా తండ్రి నర్సింహ్మారెడ్డి జోగిపేట స్కోర్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందించారు. నా సొంతింటి నుంచే రాజకీయ వారసత్వం వచ్చింది.