సంగారెడ్డి ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ)/మెదక్ : ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది. కలెక్టర్ హనుమంతరావు ఇటీవల ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. పౌరసరఫరాలశాఖ, డీఆర్డీఏ తదితర శాఖలు సంయుక్తంగా ధాన్యం కొనుగోలుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. యాసంగి సీజన్ 2020-21కు సంబంధించి 1,60,682 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం జిల్లాలో 143 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. రైతుల నుంచి డిమాండ్ పెరిగితే మరిన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణకు సంబంధించి రెండు రోజుల కింద ఐకేపీ, డీసీఎంఎస్, మార్కెటింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. అవసరమైన రిజిష్టర్లు ఇతర పుస్తకాలు అందజేశారు. ఈ నెల 15 నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
1.60 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
యాసంగి సీజన్ 2020-21లో 1,60,682 టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది యాసంగి సీజన్లో 81,508 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అందోలు, పుల్కల్, హత్నూర, కల్హేర్, నారాయణఖేడ్, కంగ్టి, సిర్గాపూర్, మునిపల్లి, కంది, వట్పల్లి ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా వరి పంట సాగు చేశారు. యాసంగి సీజన్లో ఎకరాకు 24 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తున్నదని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఈ లెక్కన రైతులు సాగు చేసిన 81,508 ఎకరాల్లో 1,95,619 టన్నుల ధాన్యం దిగుబడి రానున్నది. ఇందులో 34,937 టన్నుల ధాన్యాన్ని రైతులు విత్తనాలు ఇతర అవసరాల కోసం వాడుకుంటారని అంచనా. మిగిలిన 1,60,682 టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయనున్నారు. ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనుండటంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ధాన్యం అమ్ముకునేందుకు దళారుల వద్దకు వెళ్లకుండా గ్రామంలోఅమ్ముకునే సౌలభ్యం కల్పించిన సీఎం కేసీఆర్కు రైతులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గ్రేడ్ ఏ రకం ధాన్యానికి రూ.1888, కామన్ రకానికి రూ.1868 ధర చెల్లించనున్నారు.
143 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
జిల్లాలో 143 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో 80 కొనుగోలు కేం ద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 60, మార్కెట్ యార్డుల ఆధ్వర్యంలో మూడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి కొనుగోలు కేం ద్రాలు ప్రారంభమయ్యేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. గత యాసంగి సీజన్లో 93 కేంద్రాల ద్వారా 54,945 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఈ సీజన్లో 143 కేంద్రాల ద్వారా 1.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించనున్నారు. కొనుగోలు కేంద్రాలకు అవసరమైన ఎలక్ట్రానిక్ తూనికలు, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తేమశాతం కొలిచే పరికరాలు, గన్నీబ్యాగులు అందజేస్తున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మెదక్ జిల్లాలో 350 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
మెదక్ జిల్లాలో 20 మండలాల్లో 2,12,529 ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. 4,92,247 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
వానకాలంలో కంటే పెరిగిన కేంద్రాలు..
గతేడాది యాసంగిలో మెదక్ జిల్లాలో 201 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, వానకాలంలో 322 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించారు. ఈ యాసంగిలో 350 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 2019-20 యాసంగిలో 79,305 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా, 1.77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ప్రస్తుత యాసంగిలో 2,12,529 ఎకరాల్లో వరి చేయగా, దీని ద్వారా 4,92,247 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు.
రైతు చెంతనే కొనుగోలు కేంద్రాలు..
రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసిన 72 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నది.
రైతులకు ఇబ్బంది కాకుండా ఏర్పాట్లు
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వరి ధా న్యం కొనుగోలు కేంద్రా ల్లో ఏర్పాటు చేస్తున్నాం. ఐకేపీతోపాటు అన్ని కలిపి 143 కొనుగోలు కేంద్రాలు ప్రారం భం కానున్నాయి. ధాన్యం కొనుగోలు కేం ద్రాల్లో అవసరమైన వసతులు కల్పిస్తున్నాం. సిబ్బందికి శిక్షణ పూర్తి చేశాం. త్వరలోనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాత కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి.
-శ్రీనివాస్రావు, డీఆర్డీవో, సంగారెడ్డి జిల్లా
అన్ని ఏర్పాట్లు చేశాం
ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేశాం. రైతులకు ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. గతంలో కంటే జిల్లాలో 350 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఏప్రిల్ రెండో వారం నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.
-శ్రీనివాస్, పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి, మెదక్
ఇవీ కూడా చదవండీ…