సంగారెడ్డి, మే 4 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నది. రోగనిర్ధారణ పేద రోగులకు భారంగా మారింది. ఈ క్రమంలో 57 రకాల రోగనిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం ఇకపై పూర్తిగా ఉచితంగా చేయనున్నది. జిల్లా కేంద్రం దవాఖానల్లో తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ (టీ-హబ్)లను ఏర్పాటు చేసింది. సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర దవాఖాన సముదాయంలో ప్రభుత్వం కొత్తగా రూ.2.50 కోట్లతో డయాగ్నోస్టిక్ హబ్ను ఏర్పాటు చేసింది. సోమవారం దీనికి ప్రారంభించనున్నట్లు సీఎం కేసీఆర్ శనివారం ప్రకటించారు. సంగారెడ్డిలో ఈ సేవలు సోమవారం నుంచి రోగులకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే సిద్దిపేటలో ఈ సేవలు ప్రారంభించారు. డయాగ్నోస్టిక్ హబ్ ఆర్థిక మంత్రి హరీశ్రావు టీ-హబ్ ప్రారంభించే అవకాశం ఉంది. డయాగ్నోస్టిక్ హబ్ ఏర్పాటు కోసం రూ.50 లక్షలతో భవనం నిర్మించారు. అన్నిరకాల రోగనిర్ధారణ పరీక్షలు చేసేందుకు రూ.2 కోట్లతో పరికరాలు ఏర్పాటు చేశారు. కొన్ని రోజులుగా డయాగ్నోస్టిక్ హబ్ సిబ్బంది రోగనిర్ధారణ పరీక్షల్లో కచ్చితత్వాన్ని పరిశీలించేందుకు పరీక్షలు (డ్రైరన్) నిర్వహిస్తున్నారు. రోగనిర్ధారణ పరీక్ష ఫలితాలు పరిశీలించిన వైద్యాధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డిలో డయాగ్నోస్టిక్ హబ్ సేవలు ప్రారంభంతో సంగారెడ్డితో పాటు పొరుగున ఉన్న మెదక్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఇక్కడికి చికిత్స కోసం వచ్చే రోగులకు మేలు జరుగనున్నది.
57 రకాల రోగనిర్ధారణ పరీక్షలు …
రోగనిర్ధారణ కోసం కార్పొరేట్ దవాఖానల్లో చేసే పరీక్షలను డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా పూర్తిగా ఉచితంగా ప్రభు త్వం రోగులకు అందజేయనున్నది. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ హబ్లో 57 రకాల రోగనిర్ధారణ పరీక్షలు చేస్తారు. రూ.2 కోట్లతో డయాగ్నోస్టిక్ హబ్ను ఏర్పాటు చేశారు. ఇందులో బయోకెమిస్టు విభాగంలో 35 రకాల పరీక్షలు చేస్తారు. మధుమేహం (డయాబెటిక్) నిర్ధారణ కోసం ఎఫ్బీఎస్(ఫాస్టింగ్ బ్లడ్షుగర్), పీఎల్బీఎస్ (పోస్టు బ్లడ్షుగర్), ఆర్బీఎస్ (ర్యాండమ్ బ్లడ్షుగర్), గ్లూకోజ్ టాలరెన్స్ తదితర పరీక్షలు చేస్తారు. థైరాయిడ్ ప్రొఫైల్లో టీ 3 టోటల్, టీ 4 టోటల్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పరీక్షలు చేయనున్నారు. లివర్ ఫంక్షన్ టెస్టులో పది రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. రీనల్ ఫంక్షనల్ టెస్టు( రెండు రకాలు), లిపిడ్ ప్రొఫైల్(ఏడు రకాలు) పరీక్షలు చేస్తారు. సీరం ఎల్రక్టోలైట్ పరీక్షల్లో సీరం సోడియం, సీరం పొటాషియం, సీరం క్లోరైడ్తో సహా మరో నాలుగు రకాల పరీక్షలు ఉచితంగా చేయనున్నారు. పాథాలజీ విభాగంలో కంప్లీట్ బ్లడ్ పిక్షర్ పరీక్షల్లో 14 రకాల పరీక్షలు చేస్తారు. మైక్రో బయాలజీలో చికెన్ గున్యా, డెంగీతో పాటు మరో ఆరు రకాల రోగనిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయనున్నారు. ఆటోమేటిక్ క్లినికల్ కెమిస్ట్రీ అనలైజర్, ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ అనలైజర్, ఇమ్యునోఅస్సె అనలైజర్, హెమటాలజీ అనలైజర్, ఎల్రక్టోలైట్ అనలైజర్, ఆటోమేటిక్ యూరిన్ అనలైజర్ తదితర యంత్రాలను ఏర్పాటు చేశారు. ఒక వైద్యుడు, మేనేజర్, ఏడుగురు ల్యాబ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్ను ఏర్పాటు చేశారు. రోగి తన రక్తనమూనా, వ్యక్తిగత వివరాలు, సెల్నెంబర్ ఇవ్వగానే పరీక్షలు చేసి రిపోర్టులను రోగి సెల్ఫోన్కు పంపుతారు. పీహెచ్సీల నుంచి రక్త నమూనాలను సేకరించేందుకు ప్రత్యేకంగా ఒక వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 17 నుంచి డయాగ్నోస్టిక్ హబ్లో డ్రైరన్ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 8,696 మంది రోగుల నుంచి శాంపిల్స్ తీసుకుని, 13,745 పరీక్షలు నిర్వహించారు. డ్రైరన్ విజయవంతం కావడంతో ప్రభుత్వం సోమవారం డయాగ్నోస్టిక్ హబ్ సేవలను ప్రారంభించనున్నది. పీహెచ్సీల నుంచి రోగులకు సంబంధించిన రక్తనమూనాలను తీసుకువచ్చి ఇక్కడి డయాగ్నోస్టిక్ హబ్లో పరీక్షలు చేసి ఫలితాలను రోగులకు అందజేస్తారు. రోగనిర్ధారణతో వైద్యులు రోగికి మెరుగైన వైద్యం అందించేందుకు వీలు కలుగుతున్నది.
ఆర్టీపీసీఆర్ కేంద్రం సిద్ధం..
సంగారెడ్డిలో రూ.1.02 కోట్లతో ప్రభుత్వం రివర్స్ ట్రాన్స్ప్రిక్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ (ఆర్టీపీసీఆర్) పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం ఏర్పాటు కోసం ఆర్థిక మంత్రి హరీశ్రావు చొరవ చూపారు.
ఆర్టీపీసీఆర్ కేంద్రంలో మిషనరీని ఏర్పాటు చేశారు. ఏడుగురు సిబ్బంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. డయాగ్నోస్టిక్ హబ్తో పాటు దీనిని ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం సంగారెడ్డిలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయడం లేదు. నమూనాలను తీసుకుని ఆర్టీపీసీఆర్ పరీక్ష కోసం నమూనాలను హైదరాబాద్ పంపుతున్నారు. దీంతో రోగనిర్ధారణ కొంత ఆలస్యం అవుతున్నది. దీనిని అరికట్టేందుకు వీలుగా సంగారెడ్డిలోనే ఆర్టీపీసీఆర్ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.