సంగారెడ్డి, (నమస్తే తెలంగాణ)/ మెదక్, ఏప్రిల్ 5: సబ్బండ వర్ణాల్లోని కులవృత్తులపై ఆధారపడి పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ సీఎం కేసీఆర్ పాలనపై, సీఎం కేసీఆర్ తీసుకునే ప్రజోపయోగ నిర్ణయాలపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సెలూన్లు, లాండ్రీలు, దోబీఘాట్లకు ఉచిత విద్యుత్ను అందజేయనున్నట్లు సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించారు. 250 యూనిట్ల వరకు నెలకు ఉచితంగా కరెంటు సరఫరా చేయనున్నట్లు ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో సెలూన్లు, లాండ్రీలు, దోబీఘాట్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పల్లె ప్రాంతాల్లోనూ సెలూన్లు, ఇస్త్రీ దుకాణాలు నడుస్తున్నాయి.
ఏప్రిల్ ఒకటి నుంచే అమలు..
హెయిర్ సెలూన్లు, దోభీఘాట్లకు ఈ నెల ఒకటో తేదీ నుంచే ఉచిత విద్యుత్ పథకం అమలు కానున్నది. మారుమూల గ్రామాలతో పాటు పట్టణాల్లో అన్ని హెయిర్ సెలూన్లకు, లాండ్రీ షాపులకు, దోభీఘాట్లకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన కరెంటు అందుబాటులోకి రానున్నది. కులవృత్తినే నమ్ముకుని జీవిస్తున్న నాయీ బ్రాహ్మణులు, రజకులకు బిల్లుల భారం నుంచి ఉపశమనం లభించనున్నది.
విద్యుత్ వెలుగుల్లో సెలూన్లు…
సంగారెడ్డి జిల్లాలో మొత్తం 3500 వరకు సెలూన్లు ఉన్నాయి. కుల వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న నాయీబ్రాహ్మాణులు పట్టణాలతోపాటు గ్రామాల్లోనూ సెలూన్లను నడుపుతున్నారు. మెదక్ జిల్లాలో నాయీబ్రాహ్మణులు 3వేల మంది ఉండగా, ఇందులో 2వేల మంది కుల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇందులో కరెంటు బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నవారు ఉన్నారు. కాగా, నెలకు 250 యూనిట్ల విద్యుత్ ఉచితంగా సరఫరా చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రకటనపై నాయీబ్రాహ్మణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కరెంటు కనెక్షన్లు లేకుండా సెలూన్లను నడుపుతున్నవారు ఈ నిర్ణయంతో కొత్తగా విద్యుత్ కనెక్షన్లు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఉచిత కరెంట్తో సెలూన్లు నడుపుతున్న నాయీబ్రాహ్మణులపై ఆర్థికభారం తగ్గనున్నది.
రజకులకు తగ్గనున్న ఆర్థిక భారం..
సంగారెడ్డి జిల్లాలో రజక వృత్తిలో కొనసాగుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 2 నుంచి 3వేల వరకు ఇస్త్రీ, లాండ్రీ దుకాణాలు ఉన్నాయి. అలాగే పది దోబీ ఘాట్లున్నాయి. మెదక్ జిల్లాలోనూ 12వేల మంది రజకులు ఉన్నారు. వీరిలో 3వేల మంది కుల వృత్తులను నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. పట్టణ ప్రాంతాలతోపాటు పల్లెల్లోనూ ఇస్త్రీ దుకాణాలు నడుపుతున్న రజకులు ఎక్కువ మంది పేదలే. అద్దె దుకాణాలు, డబ్బాల్లో లాండ్రీ దుకాణాలు నడుపుతున్న రజకులు బొగ్గు పెట్టెలతోపాటు కరెంటు ఇస్త్రీ పెట్టెలతోనూ పనిచేస్తూ ఉంటారు. అద్దెకు తోడు కరెంటు బిల్లు ఎక్కువగా ఉండటంతో రజకులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కాగా, టీఆర్ఎస్ ప్రభుత్వం లాండ్రీ దుకాణాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు ప్రకటించటంతో రజకుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం తమకు ఆర్థిక భరోసా కల్పించనున్నదని చెబుతున్నారు.
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు..
సెలూన్లకు ఉచిత కరెంటు సరఫరా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు. జిల్లాలో చాలా మంది నాయీబ్రాహ్మణులు కరెంటు బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతినెలా 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయటంతో చాలా మందికి ఆర్థికంగా ప్రయోజనం చేకూరనున్నది.
మాట తప్పని గొప్ప మనిషి సీఎం కేసీఆర్..
ఇచ్చిన మాట తప్పని గొప్ప మనిషి సీఎం కేసీఆర్. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని నాయీ బ్రాహ్మణులకు నెలకు 250 యూనిట్లు ఉచితంగా కరెంటును ఇస్తున్నారు. కుల వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న మాకు దేవుడిలా ఆదుకుంటున్నారు. ఆయనకు రుణపడి ఉంటాం.
గొప్ప నిర్ణయం..
సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయంతో రజకులకు ఎంతో మేలు జరుగుతుంది. లాండ్రీలు, దోబీఘాట్లు ప్రతినెలా 250 యూనిట్ల విద్యుత్ ఉచితంగా విద్యుత్ సరఫరా చేయటం సంతోషాన్ని కలిగిస్తుంది. పేద రజకులకు సీఎం నిర్ణయం వరం కానుంది.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..
లాండ్రీలు, దోబీఘాట్లకు నెలకు 250 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇవ్వడం చాలా సంతోషం. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ లాండ్రీలు, దోబీఘాట్ల పరిస్థితులను అర్థం చేసుకుని ఉచితంగా కరెంట్ ఇస్తున్నారు.
ఉచిత విద్యుత్పై రజకుల హర్షం..
లాండ్రీలు, దోబీఘాట్లకు ఈనెల 1వ తేదీ నుంచి ఉచిత విద్యుత్ అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడం సంతోషంగా ఉంది. చాలా మంది లాండ్రీలు, దోబీఘాట్లను నిర్వహిస్తూ జీవిస్తున్నారు. అలాంటి వారికి కరెంటు బిల్లు లేకుండా చేసి ఆర్థికసాయం చేశారు. జిన్నారం మండల రజకుల తరఫున సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
ఇవీ కూడా చదవండి…
ఎనకటి రోజులు యాదికొస్తున్నయ్!
గంగదేవిపల్లిలో ట్రైనీ కలెక్టర్లు
చీఫ్ విప్ బోడకుంటికి సీఎం కేసీఆర్ పరామర్శ