గుమ్మడిదల, మే 4 : అడవుల రక్షణతోపాటు వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. మండుటెండలో వన్యప్రాణులు దూప తీర్చుకోవడానికి రోడ్లుపైకి రాకుండా ఈ వేసవికాలంలో అడవిలో ఉన్న సాసర్ పిట్లలో నిత్యం ట్రాక్టర్ల ద్వారా నీరు పెడుతూ వన్యప్రాణుల దూప తీరుస్తున్నారు. దీంతో వన్యప్రాణులు రోడ్ల మీదకు రాకుండా అడవుల్లోనే ఉంటున్నాయి. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో నల్లవల్లి, మంబాపూర్, గుమ్మడిదల, కానుకుంట, బొంతపల్లి గ్రామాల పరిధిలో అడవులు ఉన్నాయి. ఇవి గుమ్మడిదల మండల పరిధిలోకి రాగా దాదాపు రెండువేల హెక్టార్ల అడవి విస్తీర్ణంతో కలిగి ఉంది. ఇందులో పులులతోపాటు జింకలు, దుప్పిళ్లు, కుందేళ్లు, అడవి పందులు, కోతులు, నక్కలు, తోడేళ్లు, పక్షులు, నేమళ్లు తదితర వన్యప్రాణులు ఉన్నాయి. అడవులను సంరక్షించడానికి వాటి అందాలను తెలియజేయడానికి అడవుల్లో ఉండే వన్యప్రాణాలు అడవి అందానికి దోహదపడుతున్నాయి.
అడవుల పచ్చదనంతోపాటు పక్షుల కిలకిలరావాలు ఆహ్లాదపరుస్తాయి. వానకాలంలో వాగులు, వంకల్లో ఉన్న నీటితో వన్యప్రాణులు దాహం తీర్చుకుంటాయి. కానీ వేసవికాలంలో వాగుల్లో నీరు ఎండిపోవడంతో వాటి దాహం తీర్చడానికి అటవీశాఖ అధికారులు గతంలో 36 సాసర్ పీట్లు ఉన్నాయి. ఈ వేసవిలో ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా ప్రతిరోజూ నీరు పెడుతూ వాటి దాహం తీరుస్తున్నారు. పగలు కోతులు, నేమళ్లు, కుందేళ్లు, పందులు దాహం తీర్చుకుంటాయి. కాగా, రాత్రి వేళలో పులులు దాహం తీర్చుకోవడానికి సాసర్ పీట్ల వద్దకు వచ్చి దాహం తీర్చుకుంటాయని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఇటీవల ఎండలు దంచికొడుతుండడంతో వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వీటితోపాటు వేసవికాలంలో అడవి సంపదను కొల్లగొట్టే అక్రమ కలప వ్యాపారులను కట్టడి చేయడానికి కావలి కాస్తున్నామని అధికారులు వెల్లడించారు. కందకాలను తవ్వించి అటవీ సంపదను రక్షిస్తున్నారు. బీట్రూట్ అధికారులు నిత్యం నిఘా పెడుతున్నారు. రాత్రి వేళలో వన్యప్రాణులను వేటగాళ్లు వేటాడకుండా గట్టిబందోబస్తు చేస్తున్నామని తెలిపారు. వన్యప్రాణులకు, అటవీ సంపదను కొల్లగొట్టేవారిపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
వన్యప్రాణుల దాహార్తి తీర్చడానికి..
గుమ్మడిదల మండలంతోపాటు మంభాపూర్, నల్లవల్లి, గుమ్మడిదల అటవీ ప్రాంతంలో 36 సాసర్ పీట్లు ఉన్నాయి. వేసవికాలంలో వన్యప్రాణుల దాహం తీర్చుకోవడానికి నీరు లేకపోవడంతో ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా ప్రతిరోజూ నీళ్లు పోస్తున్నాం. దీని వల్ల అడవుల్లో ఉన్న ప్రాణులు దాహం తీర్చుకుంటున్నాయి. అలాగే హరితహారంలో భాగంగా అడవుల్లో నాటిన మొక్కలకు నీరు పెడుతూ అటవీ సంపదను రక్షిస్తున్నాం. అక్రమ కలప వ్యాపారులకు, వేటగాళ్లపై నిఘా పెడుతున్నాం. ఎవ్వరైనా అటవీ సంపదను, వన్యప్రాణుల రక్షణకు భంగం కలిగిస్తే కఠిన శిక్షలు ఉంటాం.