సదాశివపేట, మే 4: ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. ఆర్టీసీ బస్సు షెల్టర్లు అందుబాటులో లేనిచోట ప్రయాణికులకు ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ఆర్టీసీ అధికారులు వినూత్న ఆలోచన చేసి ప్రజల ఇబ్బందులు తీర్చుతున్నారు. సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఉద్యోగులు, విద్యార్థులు, ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తారు. పెద్దఎత్తున ప్రయాణాలు సాగిస్తున్నవారు ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ఎలాంటి షెల్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆర్టీసీ డిపో మేనేజర్ వినూత్నంగా ఆలోచన చేశారు. సంగారెడ్డి డిపోలో పాడైన బస్సును పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో బస్ షెల్టర్గా ఏర్పాటు చేశారు. నారాయణఖేడ్ ఆర్టీసీ అధికారులు కూడా రాజీవ్చౌక్ వద్ద పాడైన బస్సును బస్ షెల్టర్గా ఏర్పాటు చేసి ప్రయాణికులు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కల్పిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు చేసిన ఆలోచనకు మంచిస్పందన లభిస్తున్నది. బస్ షెల్టర్గా మారిన బస్సులో ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉంటున్నారు. ఈ బస్ షెల్టర్లు ఉదయం 7 నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటున్నాయి. అనంతరం వాటిని డిపోలకు తరలిస్తున్నారు.
బస్ షెల్టర్లో తాగేందుకు మినరల్ వాటర్..
ప్రయాణికుల కోసం బ్రీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బస్ షెల్టర్లో మినరల్ వాటర్ను ఏర్పాటు చేశారు. సంగారెడ్డి, నారాయణఖేడ్లో ఏర్పాటు చేసిన ఈ బస్ షెల్టర్లకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాం తాల్లో ఇలాంటి బస్ షెల్టర్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రయాణికుల నుంచి స్పందన..
డిపోల్లో పనిచేయని ఆర్టీసీ బస్సులను తాత్కాలిక బస్ షెల్టర్లుగా వినియోగిస్తున్నాం. మొదటగా సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక బస్సును బస్ షెల్టర్గా వినియోగిస్తున్నాం. తాత్కాలిక బస్ షెల్టర్కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వాటిలో కూర్చొని బస్సుల కోసం వేచి చూస్తూ సేద తీరుతున్నారు. బస్సుల రాకపోకలను ఎప్పటికప్పుడు తెలిపేందుకు అక్కడ ఒక అధికారిని ఏర్పాటు చేసి మైక్ ద్వారా ప్రకటిస్తున్నాం.
-నాగభూషణం, సంగారెడ్డి ఆర్టీసీ డీఎం