సంగారెడ్డి ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : మృత్యు ఒడిలోకి చేరిన తమ ఆత్మీయులకు ప్రశాంతమైన వాతావరణంలో ఆత్మీయ వీడ్కోలు పలకాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో అలాంటి పరిస్థితులు లేవు. పట్టణాల్లో సరైన శ్మశాన వాటికలు లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మతాలు, కులాల వారీగా శ్మశాన వాటికలు ఉన్నప్పటికీ అందులో సరైన వసతులు లేవు. దీంతో పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఆఖరి మజిలీ ఆత్మీయంగా సాగేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జిల్లాలోని 8 మున్సిపాలిటీల్లో హైదరాబాద్ తరహాలో 10 మహాప్రస్థానాలను నిర్మించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో శ్మశాన వాటికల సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ప్రభుత్వం వైకుంఠధామాలను నిర్మించింది. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 647 పంచాయతీలు ఉండగా 646 పంచాయతీల్లో వైకుంఠ ధామాల నిర్మాణం పూర్తైంది. అన్ని వసతులతో ప్రభుత్వం జిల్లాలో వైకుంఠధామాలను నిర్మించింది. చనిపోయిన వారికి అంతిమ సంస్కారాలు ప్రశాంతంగా పూర్తి చేసేలా వైకుంఠధామాల్లో ఏర్పా ట్లు చేపట్టడంపై ప్రజలు సంతో షం వ్యక్తం చేస్తున్నారు. మహాప్రస్థానంల నిర్మాణం కోసం అనువైన స్థలాలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మహాప్రస్థానంల నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం బడ్టెట్లో నిధులను సైతం కేటాయించింది. దీంతో త్వరలోనే పట్టణాల్లో మహాప్రస్థానంలు అందుబాటులోకి రానున్నాయి.
మహాప్రస్థానాలను నిర్మించునున్న ప్రాంతాలు
సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, సదాశివపేట, అందోలు, ఆమీన్పూర్, బొల్లారం, నారాయణఖేడ్, తెల్లాపూర్, జహీరాబాద్లో మహాప్రస్థానంలను నిర్మించనున్నారు. జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల్లో మొత్తం 10 మహా ప్రస్థానాలను నిర్మించనున్నారు. జనాభా ఎక్కువగా ఉన్న సంగారెడ్డి, అమీన్పూర్ లో రెండు మహాప్రస్థానాలను నిర్మించనుండగా మిగితా మున్సిపాలిటీల్లో ఒక్కో మహా ప్రస్థానంను నిర్మించనున్నారు. రెండు నుంచి మూడు ఎకరాల విస్తీర్ణంలో మహా ప్రస్థానంలను నిర్మించనున్నారు. అలాగే మహా ప్రస్థానంలో పూలు, ఇతర మొక్కలను పెంచి గ్రీనరీ ఏర్పాటు చేస్తారు. ఒక్కో మహాప్రస్థానం నిర్మాణానికి రూ.1.50 కోట్ల నుంచి రూ.2 కోట్ల నిధులు ఖర్చు చేయనున్నారు.
అన్ని వసతులతో నిర్మాణం
సంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీల్లో సరైన సంఖ్యలో శ్మశానవాటికలు లేవు. ఉన్న శ్మశానవాటికల్లో నీటి సౌకర్యం, స్నాన పు గదులు తదితర వసతులు లేవు. దీంతో అంతిమ సంస్కారాలకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. కొంత మంది సొంత భూముల్లో అంత్యక్రియలు జరుపుకుంటున్నారు. మిగితా వారు తమ వారు మృతి చెందితే అరొకర వసతులు ఉన్న చోట అంతిమ సంస్కారాలు చేసి వేధనకు గురవుతున్నారు. ప్రభుత్వం పట్టణాల్లో అన్ని వసతులుతో పాటు ప్రశాంతమైన వాతావరణంలో ఆఖరి మజిలీ పూర్తయ్యేలా మహాప్రస్థానాలను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది.
త్వరలో పనులు ప్రారంభిస్తాం
ప్రభుత్వ ఆదేశాలతో సంగారెడ్డి జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన వైకుంఠధామాల నిర్మాణం పూర్తి చే శాం. అదే తరహాలో సం గారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీల్లో మహాప్రస్థానాల నిర్మాణం పూర్తి చేస్తాము. వాటి నిర్మాణం కోసం మున్సిపాలిటీల్లో అనువైన స్థలాఆలను త్వరలోనే గుర్తించి నిర్మాణం పనులను ప్రారంభిస్తాం.