“ఆమె పేరు లక్ష్మి.. భూపాలపల్లి వాసి.. మే 1న కొడుకు నిశ్చితార్థం ఉండటంతో షాపింగ్ కోసం ఈనెల 23న కుటుంబమంతా నగరానికి వచ్చారు. 6 గంటల ప్రయాణం. బంధువుల ఇంట్లో రెండు రోజులు ఉండి కార్యక్రమానికి సంబంధించిన షాపింగ్ ముగించారు. తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. ఆ మరుసటి రోజున లక్ష్మికి స్పల్ప జ్వరం, ఒళ్లునొప్పులు మెదలయ్యాయి. అనుమానంతో టెస్ట్ చేయించుకోగా కొవిడ్ పాజిటివ్గా తేలింది. కన్నకొడుకు వేడుకకు హాజరుకాలేకపోతుంది”. ఈ క్లిష్ట సమయంలో లక్ష్మి ప్రయాణం చేయడమే దీనికి కారణం.
“దిల్సుఖ్నగర్కు చెందిన ప్రకాశ్ రెడ్డి.. తన కంపెనీ పనిమీద అనంతపురం వెళ్లాడు. పని ముగించుకుని ఇంటికొచ్చిన రెండు రోజులకు తన కూతురు స్వప్నకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంట్లో ఉన్నప్పటికీ తనకు కరోనా రావడం ఏంటని అనుమానంతో ఏ లక్షణాలు లేని అతడు కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. అతడికి పాజిటివ్ వచ్చింది”.. దీంతో తన ప్రయాణం వల్లే కొవిడ్ బారిన పడ్డామని ఆయన ఆవేదన చెందాడు.
‘టికెట్ లేని ప్రయాణం నేరం.. అందుకు వెయ్యి రూపాయల జరిమానా…’ మరీ మాస్క్, శానిటైజర్ లేని జర్నీ.. అది ప్రాణాంతకం. ఇది ఎవరూ చెప్పరు.. మనమే గ్రహించాలి. చాలా మంది కొవిడ్ విజృంభణలోనూ ప్రయాణాలు చేస్తున్నారు. శుభకార్యాలు, అంత్యక్రియలు, కంపెనీ పనులు, ఆసుపత్రి ఎమర్జెన్సీలు.. ఇలా అత్యవసరమైతేనే ప్రయాణాలు పెట్టుకుంటున్నారు. కానీ ఆ జర్నీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా కొవిడ్ వైరస్ బారిన పడుతున్నారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని సైతం రిస్క్లో పెడుతున్నారు. ఇప్పుడు ప్రయాణంలో మాస్క్లు,శానిటైజర్లే ఆయుధం.. ఇప్పుడు వాటిని తమ వెంట తీసుకెళ్లకపోతే.. తమ ప్రాణాలకే కాదు ఇతరుల ప్రాణాలకు ముప్పే. దీంతో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ తమ వెంట మాస్క్, శానిటైజర్ ఉండాల్సిందే.. లేకపోతే కొవిడ్ను కొని తెచ్చుకున్నట్లే..!
పెండ్లి షాపింగ్ చేయాల్సి ఉంది. అందుకోసం విజయవాడ వెళ్లాలని భావించాం. కానీ ప్రయాణం రద్దు చేసుకున్నాం. కారణం.. కొవిడ్ వ్యాప్తి అధికమవడం. షాపింగ్ కోసం గంటల తరబడి ప్రయాణం చేయాలి. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు. కరోనా సోకితే అస్సలుకే మోసం వస్తుంది. ఫంక్షన్కు వెళ్లడం ఉండదు. అందుకే భయమేసి ఉన్న వాటిలో కొత్తవి ధరించి ఫంక్షన్కు అటెండ్ కావడం ఉత్తమం. -సంగీత, గృహిణి