రామచంద్రాపురం : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలతో మత్స్యకారులకు పుష్కలంగా చేతినిండా ఉపాధి లభిస్తుందని శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి అన్నారు. బుధవారం ఆర్సీపురం డివిజన్లోని రాయసముద్రం చెరువులో రూ.72వేలు విలువ చేసే 36వేల చేపపిల్లలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, డివిజన్ కార్పొరేటర్ పుష్పానగేశ్తో కలిసి వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులు ఆర్థికాభివృద్ధి చెందడానికి ప్రభుత్వమే ఉచితంగా చేపపిల్లలను అందజేస్తుందని పేర్కొన్నారు.
మిషన్ కాకతీయ పథకం ద్వారా రాష్ట్రంలోని చెరువులన్నీ వర్షాలతో జలకళను సంతరించుకున్నాయని, ప్రభుత్వం మత్స్యకారులకు ప్రోత్సహకాలు, రాయితీలు అందజేయడంతో చెరువుల్లో చేపలు దండిగా పెరుగుతున్నాయని అన్నారు. దీంతో వారికి పుష్కలంగా ఉపాధి దొరుకుతుందని చెప్పారు. గతంలో వర్షాలు లేక చెరువులు ఎండిపోయి ఉపాధిని కోల్పోయ్యారని అన్నారు. మిషన్కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్ట్ తో చెరువులకు పూర్వవైభవం వచ్చిందన్నారు.
ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని తెలిపారు. ప్రతి సంవత్సరం వందలకోట్ల రూపాయలను ఖర్చు చేస్తు చెరువుల్లో చేపపిల్లలను వదులుతుందన్నారు. రాయసముద్రం చెరువు వద్ద ఉన్న నాగులమ్మ ఆలయం సమీపంలో లింగమయ్య ఆలయ నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పరమేశ్, నాయకులు ఆదర్శ్రెడ్డి, కుమార్గౌడ్, మోహన్రెడ్డి, గోవింద్, ప్రమోద్గౌడ్, ఐలేశ్, మల్లేశ్, బేకుయాదయ్య తదితరులు పాల్గొన్నారు.