రామచంద్రాపురం, అక్టోబర్ 26 : రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వచ్చేనెల 15వ తేదీన వరంగల్లో నిర్వహించే విజయగర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పటాన్చెరు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సభకు తరలివెళ్తామని అన్నారు. దేశంలోనే 60 లక్షల సభ్యత్వాలు కలిగిన ఏకైక ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ అని తెలిపారు. గులాబీ పార్టీకి 60 లక్షల సైన్యం ఉండడం మనందరికి గర్వకారణమన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడేండ్ల కాలంలోనే రాష్ట్రం ఎంతో పురోగతిని సాధించిందన్నారు.
రాష్ట్రంలో అన్నివర్గాలు, అన్నికులాల వారు సంతోషంగా బతుకుతుంటే ఓర్వలేక ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తు ప్రజలను తికమక చేస్తున్నారని, టీఆర్ఎస్ పార్టీ సైనికులు వాటిని తిప్పికొట్టేల కదం తొక్కాలని సూచించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లలితాసోమిరెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ హారిక, ఏఎంసీ వైస్చైర్మన్ మల్లారెడ్డి, వైస్చైర్మన్ రాములుగౌడ్, పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు దేవేందర్యాదవ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.