కోతుల ఆహార భద్రతకు ఆలోచిస్తున్న ప్రభుత్వం మాది : పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి
పటాన్ చెరు: కోతుల ఆహార భద్రతకు ఆలోచిస్తున్న ప్రభుత్వం మాదని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన పటాన్ చెరు మండలం కర్ధనూర్ గ్రామంలో మంకీ ఫుడ్ కోర్టులో పండ్ల మొక్కలు నాటారు. గ్రామ పరిధిలోని ఎకరా స్థలంలో కోతుల ఆహారం కోసం ఫుడ్ కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోతుల సంఖ్య పెరిగిపోవడంతో అవి ఆహారంకోసం జనావాసాలకు వస్తున్నాయన్నారు. వాటి ఆహార సమస్యను తీర్చేందుకు ఖాళీ స్థలాల్లో పండ్ల మొక్కలు పెంచి కోతుల ఫుడ్ కోర్టును ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాదన్నారు. అదేవిధంగా గ్రామ పరిధిలో పంచాయతీ ఆదాయం కోసం 30 షటర్లతో వాణిజ్య సముదాయాన్నినిర్మించేందుకు శనివారం ఆయన భూమిపూజ చేశారు. త్వరలోనే షటర్లు అందుబాటులోకి వచ్చేలా ప్రణాళిక వేస్తున్నామన్నారు. దాతల సాయం, ఎమ్మెల్యే నిధులతో పనులు పూర్తి చేస్తామన్నారు. ఆదర్శగ్రామంగా కర్ధనూర్ అభివృద్ది చెందేలా కృషి చేస్తానన్నారు.
సీఎం కేసీఆర్ అనేక రకాల సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. అనంతరం జడ్పీసీఈవో ఎల్లయ్య మాట్లాడుతూ పటాన్ చెరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రతి గ్రామం అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. కార్యక్రమంలో డీఆర్ డీవో శ్రీనివాస్, జడ్పీటీసీ సుప్రజావెంకట్ రెడ్డి, ఎంపీపీ సుష్మశ్రీ, సర్పంచ్ ఎరొళ్ల భాగ్యలక్ష్మీసత్యనారాయణ, ఎంపీటీసీ నాగజ్యోతీలక్ష్మణ్ , ఉప సర్పంచ్ వడ్డే కుమార్ , ఎంపీడీవో బన్సిలాల్ , వెంకట్ రెడ్డి, దశరథరెడ్డి, లక్ష్మణ్ , సత్యనారాయణ పాల్గొన్నారు.