సంగారెడ్డి/మెదక్, మే 17 (నమస్తే తెలంగాణ) : పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు కొత్తరూపును సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా పరిశుభ్రమైన, పచ్చని వాతావరణంలో పల్లెలు కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులివ్వడంతో గ్రామాలు ప్రగతి పథం పట్టాయి. ప్రతి పైసాను సద్వినియోగం చేసుకొని గ్రామాలను స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు కలిసికట్టుగా ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2019 సెప్టెంబర్లో పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంతో పల్లెల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఎప్పుడూ చెత్తాచెదారం, అపరిశుభ్రతతో దర్శనమిచ్చే గ్రామాలు ఇప్పుడు పరిశుభ్రతను సంతరించుకున్నాయి. నాలుగు విడతల్లో పెండింగ్లో ఉన్న పనులను ఐదో విడతలో పూర్తి చేయడంతో పాటు గ్రామ సభ ద్వారా తీర్మానించిన కొత్త పనులు చేపట్టేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
పల్లె ప్రగతికి కసరత్తు..
మెదక్ జిల్లాలో ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి జూన్ 5వ తేదీ వరకు జిల్లాలోని 469 గ్రామ పంచాయతీల్లో చేయాల్సిన పనులపై ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు. గత పల్లె ప్రగతిలో వెనుకబడిన గ్రామాలపై ఈ సారి ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. గ్రామ పంచాయతీ స్థాయిలో కార్యక్రమ నిర్వహణకు ఒక బృందం ఉంటుంది. ఇందులో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రటరీ, విద్యుత్ శాఖలో లైన్మెన్, మిషన్ భగీరథ సాంకేతిక సహాయకుడు సభ్యులుగా ఉంటారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పారిశుధ్యం, ఆరోగ్యం, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, హరితహారం కార్యక్రమ నిర్వహణ, విద్యుత్ సరఫరాలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
మారిన రూపురేఖలు…
నాలుగు విడతలుగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. పల్లెలు పచ్చగా, పరిశుభ్రంగా మారాయి. శ్రమదానాలతో వీధులు, కాలనీలు బాగుపడ్డాయి. ఆయా గ్రామాలు, పట్టణాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యల పరిష్కారంలో భాగంగా ‘పవర్వీక్’ కార్యక్రమాన్ని చేపట్టి పరిష్కరించారు. గ్రామాలు, పట్టణాల్లో వంగిన విద్యుత్ స్తంభాలు, లూజు వైర్లు సరిచేశారు. కొత్తగా మూడోలైన్ ఏర్పాటు చేశారు. ఇంటింటికీ చెత్త బుట్టలు పంపిణీ చేశారు. మహిళలు తడి, పొడి చెత్తను వేరుగా చెత్తబండ్లకు అందిస్తున్నారు. ఆ చెత్తను డంపింగ్ యార్డులకు పంపి, జీపీల ఆధ్వర్యంలో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. దీంతో వచ్చే ఆదాయాన్ని పంచాయతీ అవసరాలకు వినియోగిస్తున్నారు. చెత్తాచెదారాన్ని తొలిగించడంతో పాటుగా ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటిస్తున్నారు. మూడేండ్లలో సంగారెడ్డి జిల్లాలో పల్లె ప్రగతి ద్వారా రూ.420 కోట్లు ఖర్చు చేయటం జరిగింది. ఇవి కాకుండా ఈజీఎస్ ద్వారా అదనంగా నిధులు ఖర్చు చేశారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు సమస్యలు తొలిగిపోయాయి. జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి ద్వారా సుమారు రూ.300 కోట్ల నిధులు ఖర్చు చేశారు.
ఈనెల 20 నుంచి జూన్ 5 వరకు పల్లె ప్రగతి
జిల్లాలో ఈ నెల 20 నుంచి జూన్ 5 వరకు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, ఐదో విడతలో చేపట్టాల్సిన పనులపై గ్రామాల నుంచి నివేదికను తెప్పించుకున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. గామంలో అన్ని రోడ్లను శుభ్రపర్చడం, రోడ్లపై గుంతలను పూడ్చడం, కూలిపోయిన నిర్మాణాల తొలిగింపు, మురుగు కాల్వలను శుభ్రం చేయడం వంటి పనులు చేపట్టాలి. నీటి గుంతలలో ఆయిల్బాల్స్ వేయడం, దోమల నివారణకు రసాయనాలు చల్లడం, ఫాగింగ్ చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టాలి. మంచినీటి వనరులను శుభ్రపరిచి క్లోరినేషన్ నిర్వహించాలి. పైప్లైన్, నల్లాల లీకేజీలను మరమ్మతులు చేయాలి. వైకుంఠధామాల వద్ద రెండో వరుసలో మొక్కలు నాటడం, తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించడం, హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేయాలి.
పట్టణ ప్రగతితో సిద్ధమవుతున్న వైకుంఠధామం
పట్టణాభివృద్ధిని కాంక్షించి సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజా సమస్యలు తీర్చడంలో ఉపకరిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ఫలితంగా ఏండ్లతరబడి పరిష్కారానికి నోచుకోని సమస్యలకు మోక్షం లభించింది. నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రగతిలో భాగంగా అనేక పనులు చేపట్టగా వైకుంఠధామం నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరయ్యాయి. దీంతో వైకుఠధామం నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పనులు పూర్తయిన పక్షంలో ప్రజలకు ఎంతో సౌకర్యం ఏర్పడనుండగా, పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టిన నిర్మాణం పనులపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో…
సంగారెడ్డి జిల్లాలోని 647 పంచాయతీల్లో రూ.258 కోట్ల నిధులను ఖర్చు చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.223 కోట్ల నిధులు, రూ.2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.240 కోట్ల నిధులను ప్రభుత్వం పల్లె ప్రగతిలో భాగంగా ఖర్చు చేసింది. 647 పంచాయతీల్లో డంపింగ్యార్డులను నిర్మించారు. రైతులకు ఉపయోగపడేలా జిల్లాలో 1025 కల్లాలను నిర్మించారు. పల్లె ప్రగతిలో భాగంగా జిల్లాలోని 647 పంచాయతీలకు ప్రభుత్వం ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లను అందజేసింది. ఈజీఎస్ ద్వారా జిల్లాలో గత నాలుగు విడతలుగా జిల్లాలోని అన్ని పంచాయతీల్లో 1.50 కోట్ల మొక్కలను నాటారు. అలాగే ప్రతి పంచాయతీలో నర్సరీలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని 647 పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయటం జరిగింది. మొక్కలు నాటడంతోపాటు పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో గ్రామాల్లో పచ్చగా మారాయి.
మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి
పట్టణ ప్రగతిలో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జిల్లాలోని సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, జోగిపేట, నారాయణఖేడ్, అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం మున్సిపాలిటీల్లో రూ.250 కోట్లకుపైగా నిధులతో పనులు చేపట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది మున్సిపాలిటీల్లో రూ.66.59 కోట్ల నిధులతో వేర్వేరు పనులు నిర్వహించారు. 2020-21లో సైతం రూ.70 కోట్లకుపైగా నిధులతో పనులు చేపట్టారు. 2021-22లో రూ.50కోట్లకుపైగా నిధులు వెచ్చించారు. ఇవి కాకుండా గ్రీన్ బడ్జెట్ కింద రూ.12.60 కోట్ల నిధులు ఖర్చు చేయటం జరిగింది. పట్టణ ప్రగతిలో భాగంగా జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల్లో పారిశుధ్యం పనులకు వాహనాలు కొనుగోలు చేశారు. ఇప్పటికే 90 వాహనాలు ఉండగా, పట్టణ ప్రగతిలో భాగం గా 108 వాహనాలను అదనంగా కొనుగోలు చేశారు. 300 పబ్లిక్ టాయిలెట్లను నిర్మించారు.
పల్లె ప్రగతిలో గ్రామాలు కళకళ
పల్లె ప్రగతిలో గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయి. నాలుగు విడతలుగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం మెదక్ జిల్లాలో విజయవంతమైంది. పారిశుధ్యం, ఆరోగ్యం, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, హరితహారం, విద్యుత్ సంబంధ సమస్యలు, ఇతర కార్యక్రమాలపై దృష్టి సారిస్తాం. ఈ నెల 20 నుంచి జూన్ 5వ తేదీ వరకు చేపట్టే కార్యక్రమాల్లో పెండింగ్ పనులు పూర్తి చేస్తాం. జిల్లాలోని 469 గ్రామ పంచాయతీల్లో చేయాల్సిన పనులపై ఇప్పటికే అధికారులు ప్రణాళిక రూపొందించారు.
-ఎస్.హరీశ్,మెదక్ జిల్లా కలెక్టర్