మెదక్ మున్సిపాలిటీ సెప్టెంబర్ 17: భవన నిర్మాణాలకు సులువుగా అనుమతులు ఇచ్చేలా చట్టం తీసుకొచ్చిన పురపాలక శాఖ.. అంతేవేగంగా అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నది. టీఎస్ బీపాస్ అనుగుణంగా మున్సిపాలిటీల వారీగా డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ (డీటీఎఫ్)ను ఏర్పాటు చేయాలని ఆ శాఖ ఆదేశించడంతో ఫిబ్రవరి 23న కలెక్టర్ల పర్యవేక్షణలో నాలుగు శాఖలతో టాస్క్ఫోర్సు బృందాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లూ భవన అనుమతులు, అక్రమ నిర్మాణాలు, లేఅవుట్ల పరిశీలన వంటివి పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేసే పట్టణ ప్రణాళిక అధికారులతో పాటు వీరికి సంబంధం లేకుండా జిల్లాస్థాయిలో మున్సిపాలిటీల వారీగా టాస్క్ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశారు. దీంతో అక్రమ నిర్మాణాలపై నిఘా తీవ్రమైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 17 మున్సిపాలిటీలున్నాయి. మున్సిపల్ పరిధిలో భవన నిర్మాణ అనుమతులు జారీ చేసేందుకు టీఎస్బీపాస్ విధానం ప్రతి మున్సిపాలిటీల్లో అమలులో ఉంది. సెల్ఫ్ సర్టిఫికేషన్ ఆధారంగా 21 రోజుల్లో అనుమతులు జారీ చేస్తున్నారు. భవన నిర్మాణాలకు సంబంధించిన దరఖాస్తులను నేరుగా ఇంటి నుంచి మొబైల్ యాప్ ద్వారా లేదా మీసేవ, పౌరసేవ విభాగాల ద్వారా చేసుకోవచ్చు. మున్సిపల్ శాఖ నియమించే వార్డుకో అధికారి వార్డుల్లో అక్రమ నిర్మాణాలు జరుగకుండా, టీఎస్బీపాస్ అనుమతులు పొందిన ప్రకారం ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయా? లేదా? తెలుసుకుని వెంటనే టాస్క్ఫోర్స్ టీమ్కు సమాచారం అందిస్తారు.
త్వరలో వార్డుకో అధికారి…
మున్సిపల్ శాఖ ఆదేశాల మేరకు త్వరలోనే వార్డుకో అధికారిని నియమిస్తాం. వార్డుల్లో ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరిగినా, అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టితే వెంటనే టాస్క్ఫోర్స్కు సమాచారం అందిస్తారు. ఇక నుంచి ఎక్కడ అక్రమ నిర్మాణాలకు చోటు ఉండదు. – శ్రీహరి, మున్సిపల్ కమిషనర్