కల్హేర్ : ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు సాగు నీరందించేందుకు ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని పూడిక తీత పనులకు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది వానకాలం ప్రారంభంలోనే నల్లవాగు ప్రాజెక్టు అలుగు పారింది. రైతులు వరినాట్లు వేసేందుకు సమయాత్తం అవుతున్నారు.
అయితే నల్లవాగు ప్రాజెక్టు కాల్వలో పిచ్చి మొక్కలు, చెత్త చెదారంతో నిండి పోగా వాటిని తొలగించడాని సొంత నిధులు వెచ్చించి తీసివేయించారు. ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారిస్తూ ఈ మేరకు అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు కాల్వల మరమత్తుల కోసం రూ. 24కోట్లు నిధులను మంజూరు చేయించారు. కాగా కాంట్రాక్టర్ పనులను పూర్తి చేయకపోవడంతో కాల్వల దుస్థితి యథాతథంగా ఉండి పోయాయి.
రైతులకు సాగు నీరందించాలనే సదుద్దేశ్యంతో పూడికతీత పనులకు ఖర్చు అయ్యే డబ్బులను నేను ఇస్తానని ఆత్మకమిటీ చైర్మన్ రాంసింగ్, జడ్పీటీసీ నర్సింహరెడ్డి, కృష్ణాపూర్ గ్రామ సర్పంచ్ కిష్టారెడ్డిలకు సూచించారు. ఈ మేరకు ట్రాక్టర్, జేసీబీలతో రెండు రోజుల నుంచి పూడిక తీత పనులను వారు ప్రారంభించారు. కాల్వల్లో తీస్తున్న పూడిక తీత పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. పంటలు పండించి రైతులు సంతోషంగా జీవించేందుకు ఎమ్మెల్యే చేస్తున్న ప్రత్యేక కృషికి ఆయకట్టు రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.