సంగారెడ్డి : వినాయకుల నిమజ్జన ఊరేగింపులో డీజే సౌండ్ వినియోగిస్తే సీజ్ చేస్తామని, అందుకు పూర్తి బాధ్యత మండపాల నిర్వాహకులదేనని ఎస్పీ రమణకుమార్ స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నవరాత్రుల పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించి ప్రశాంతంగా గణనాథుల నిమజ్జనాన్ని జరుపుకోవాలన్నారు.
ముఖ్యంగా పోలీసుల సూచనలు, సలహాలు పాటించి సహకరించాలన్నారు. గణనాథుల నిమజ్జనం సమయంలో చెరువులు, కుంటల్లో పడి మునిగి పోయే అవకాశం ఉంటుందని, ముందుగానే జాగ్రత్తలు తీసుకుని లోతుగా ఉండే ప్రాంతాల్లో నిమజ్జనానికి వెళ్లడం మంచిది కాదన్నారు. ఎక్కువగా రద్దీ ఉండే ప్రదేశాల్లో పిక్ పాకెట్ లాంటి దొంగతనాలు జరిగే ఆస్కారం ఉంటుందని, నిమజ్జన ఊరేగింపులో పెద్ద మొత్తంలో నగదు, విలువైన ఆభరణాలు ధరించకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. నిమజ్జన యాత్రలో భక్తులకు పంచి పెట్టే ప్రసాదం తాజాగా ఉండేలా నిర్వాహకులు శ్రద్ధ చూపాలన్నారు.