పటాన్చెరు : గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు గాయపడిన ఘటన పటాన్చెరులో శుక్రవారం జరిగింది. పటాన్చెరు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్చెరు పట్టణంలోని గొల్లబస్తీలో నివసిస్తున్న నాగభూషణం డ్యూటీకి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాడు. అతడి ఇంట్లో గ్యాస్ లీకై దాని వాసన చుట్టు పక్కల ఇండ్లకు వ్యాపించింది. ఈ విషయాన్ని ఇరుగుపొరుగు వారు నాగభూషణంకు చెప్పే సరికే అతడు ఇంటి తాళం తీసి లోపలికెళ్లి విద్యుత్ బల్బును వేశాడు. వారి హెచ్చరికలతో ఇంట్లోంచి బయటకు రాగానే గ్యాస్ సిలిండర్ పేలింది.
ఈ పేలుడుతో పక్క పోర్షల్లో ఉంటున్న శ్యామల, సాయి, ప్రవీణ్కు గాయాలయ్యాయి. జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ ఘటనాస్థలికి చేరుకుని వారిని పటాన్చెరు ఏరియా దవాఖానకు తరలించింది. స్థానిక కార్పొరేటర్ కుమార్యాదవ్ దవాఖానకెళ్లి క్షతగాత్రులను పరామర్శించి, వారికి మెరుగైన వైద్యమందించాలని వైద్యులను కోరారు. ఈ ప్రమాదంపై పటాన్చెరు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.