రామచంద్రాపురం: పరిశ్రమల యాజమాన్యాలు సామాజిక సేవలో ముందుండాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. భారతీనగర్ డివిజన్లోని ఈఎస్ఐ దవాఖానలో ప్యారగాన్ పరిశ్రమ రూ.30లక్షల విలువతో అల్ట్రాసౌండ్ మెషి న్, డిజిటల్ ఎక్స్రే, మల్టీ ప్యారా మానిటర్స్ లను సమకూర్చి ఎమ్మెల్యే చేతుల మీదుగా మంగళవారం దవాఖానకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామిక వాడగా పటాన్చెరు పేరొం దిందని తెలిపారు. వేలమంది కార్మికులు ఈ ప్రాంతంలో నివాసం ఉంటూ జీవనోపాధి పొందుతున్నారని చెప్పారు.
ప్రతి రోజూ వందల మంది కార్మికులు చికిత్సల నిమిత్తం ఈఎస్ఐ దవాఖానకు వస్తుంటారని, దవాఖానలో అత్యాధునిక వైద్య పరికరాలు లేకపోవడంతో ప్రైవేట్ ల్యాబ్లకు వెల్లాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్యారగాన్ పరిశ్రమ యాజమాన్యంతో వైద్య సామగ్రిని అందించాలని కోరడంతో వారు స్పందించి రూ.30లక్షలతో ఈఎస్ఐ దవాఖానకు వైద్య సామగ్రిని అందజేయడం సంతోషకరమన్నారు. పరిశ్రమల యాజమాన్యాలు, కార్పొరేటర్ సంస్థలు సామాజిక బాధ్యత కింద ప్రభుత్వ దవాఖానల అభివృద్ధికి సహకారం అందించాలని సూచించారు.
కార్పొరేట్ దవాఖానలకు ధీటుగా ప్రభుత్వ దవాఖానలు నాణ్యమైన వైద్యం అందిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ దవాఖానల బలోపేతానికి కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఈఎస్ఐ దవాఖానకు వైద్య సామగ్రిని అందించిన ప్యారగాన్ పరిశ్రమ యాజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఈఎస్ఐ డాక్టర్ పద్మజ, మాజీ కార్పొరేటర్ అంజయ్య, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్, నాయకులు ఆదర్శ్రెడ్డి, నగేశ్, వెంకట్రెడ్డి, కుత్బుద్దీన్, ప్యారగాన్ ప్రతినిధులు బిను, విజిత్ తదితరులు ఉన్నారు.