కంగ్టి : గత ప్రభుత్వాలు విద్యావ్యవస్థపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇక్కడి ప్రజలు నాణ్యమైన విద్యను పొందలేకపోయారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండలంలోని ఉత్తమ ఉపాధ్యాయులను ఆయన శాలువాలతో సన్మానించారు. అంతకుముందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెలే మాట్లాడుతూ కంగ్టి మండలంలో విద్యావ్యవస్థ గతంలో అస్తవ్యస్తంగా ఉండేదన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం కంగ్టిలో జూనియర్ కళాశాలను మంజూరు చేసినప్పటికీ పక్కాభవనం కల్పించకపోవడంతో కళాశాల, పాఠశాల విద్యార్థులు ఒకే భవనంలో కొన్నేండ్లపాటు షిఫ్టుల వారీగా చదువుకున్నారని గుర్తుచేశారు.
తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన కొన్నిరోజులకే కళాశాలకు పక్కాభవనం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించినట్లు చెప్పారు. అంతేకాకుండా మండలంలో గిరిజనుల సంఖ్య అధికంగా ఉండడంతో గిరిజన గురుకుల పాఠశాలను మంజూరు చేసి ఇక్కడి గిరిజనులకు నాణ్యమైన విద్యనందిస్తున్నట్లు తెలిపారు. గత 18 నెలలుగా కొవిడ్ వైరస్ నేపథ్యంలో విద్యార్థులు సరిగ్గా చదువుకోలేకపోయారని ఉపాధ్యాయులు నిర్విరామంగా కృషి చేసి వారికి ఉన్నత చదువులు చెప్పాలన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, జడ్పీటీసీ కోట లలితాఆంజనేయులు, ఎంపీపీ సంగీతావెంకట్రెడ్డి, ఎంఈవో శంకర్, ఎంపీపీ ఉపాధ్యక్షురాలు రేఖాచంద్రశేఖర్ పాల్గొన్నారు.