సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 27 : జిల్లాలోని అర్జీదారులు తమ భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగొద్దని కలెక్టర్ హనుమంతరావు మరోసారి స్పష్టం చేశారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు కలెక్టరేట్కు తరలివచ్చి వారి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలను స్వయంగా స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను తెలుసుకొని, వారి ప్రతులను పరిశీలించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పెన్షన్లు, రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూం, భూ సమస్యలపై అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులకు పంపించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీదారులు ఆయా సమస్యలకు సంబంధించి కార్యాలయాల చుట్టూ తిరిగి శ్రమ, సమయం వృథా చేసుకోవద్దని సూచించారు. మీ సేవా ద్వారా ధరణిలో దరఖాస్తు చేయాలని కలెక్టర్ సూచించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.