ఝరాసంగం,అక్టోబర్24 : దక్షణ కాశీగా భాసిల్లుతున్న పార్వతిసమేత సంగమేశ్వర స్వామివారిని దర్శిచుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. ఆలయ మండపంలో స్వామివారికి భక్తులు అభిషేకాలు, అర్చనలు, జలాభిషేకం చేసి గర్భగుడిలోని పార్వతి సమేత సంగమేశ్వరస్వామి ఆలయంలో క్షీరాభిషేకం చేసి మొక్కులు తీర్చుకున్నారు.
సంగమేశ్వరస్వామి దర్శనం కోసం తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు, స్వామి వారికి కోడెదూడలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు అలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.