నారాయణఖేడ్ : మిషన్ భగీరథ పథకం నీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ అవసరమని, ఎప్పటికప్పుడు సిబ్బందితో సమీక్షిస్తూ సక్రమంగా నీటిని సరఫరా చేసే విధంగా చూడాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. బుధవారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు గ్రామాలకు సక్రమంగా నీరు సరఫరా కావడం లేదనే విషయం తన దృష్టికి వచ్చిందని, ఏవైనా లోపాలుంటే ఎప్పటికప్పుడూ సవరించి నీరు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పలు గ్రామాలకు సంబంధించి నీటి సరఫరా విషయంలో కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు తెలిసిందని, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించడంతో పాటు సమయానుసారంగా గ్రామాలకు నీరు సరఫరా చేసే విధంగా పర్యవేక్షించాలని ఎమ్మెల్యే సూచించారు. ఇటీవల కురిసిన అధిక వర్షాలతో కొన్ని గ్రామాలకు విద్యుత్ సమస్య తలెత్తిన కారణంగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిందని వెంటనే సవరించి నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. కార్యక్రమంలో నారాయణఖేడ్, కంగ్టి, మనూరు, సిర్గాపూర్, నాగల్గిద్ద, కల్హేర్ మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ రఘువీర్, ఈఈ షేక్ పాషా, వాటర్గ్రిడ్ ఈఈ కమలాకర్, ఆర్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈఈ ఫణివర్మ, వాటర్గ్రిడ్ డిప్యూటీ ఈఈ నరేందర్, ఏఈలు పాల్గొన్నారు.