కోహీర్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. సోమవారం ఆయన మండలంలోని గొటిగార్పల్లి పెద్దవాగు ప్రాజెక్టులో 1.80 లక్షల చేప పిల్లలను వదిలారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీని చేపట్టిందని గుర్తు చేశారు. గొటిగార్పల్లిలో మత్స్యకారుల కోసం రూ.10నుంచి రూ.12లక్షలతో కమ్యూనిటీ హాల్ను నిర్మిస్తామని ఆయన తెలిపారు.
చేపలను విక్రయించేందుకు చిన్న బైకులతోపాటు ప్రత్యేక వాహనాలను సబ్సిడీపై అందిస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పెద్దవాగు ప్రాజెక్టు మరమ్మతుల టెండర్ పొందిన కాంట్రాక్టర్ మృతి చెందాడని, వెంటనే మరో కాంట్రాక్టరుకు పనులను అప్పగించేందుకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరిందని కొత్త భవనాన్ని మంజూరు చేయాలని సర్పంచ్ అనుసూజమ్మ ఎమ్మెల్యేను కోరారు. అదేవిధంగా సెడెగుట్ట తండాకు ఎస్టీ కమ్యూనిటీహాల్ను మంజూరు చేయాలని విన్నవించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో సుజాతానాయక్, సర్పంచ్ అనుసూజమ్మ, ఉప సర్పంచ్ కమలాబాయి, కార్యదర్శి వనితారాణి, అధికారులు రవీందర్, సురేశ్, ప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.