నారాయణఖేడ్, సెప్టెంబర్ 27 : సీఎం సహాయనిధి కష్ట కాలంలో పేద ప్రజలకు ఆసరాగా నిలుస్తుందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని 13 మందికి స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులు అందజేసిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఆరోగ్యశ్రీ పథకం వర్తించని పరిస్థితుల్లో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందిన వారికి సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు.
సీఎం సహాయనిధి ద్వారా నియోజకవర్గంలోని వేలాది మందికి లబ్ధి చేకూరిందన్నారు. అనారోగ్యం కారణంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న అనేక మందికి ఎల్వోసీలను జారీ చేసి మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలను కాపాడినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు.
ప్రజలు ఇబ్బందులకు గురి కాకూడాదనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకుని ప్రయోజనం పొందాలని ఎమ్మెల్యే సూచించారు.