సంగారెడ్డి : కఏ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కొవిడ్ వ్యాక్సినేషన్లు అందించే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ డిమాండ్ చేశారు. మే 1వ తేదీ వరకు సంగారెడ్డి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోజుకు 100 మందికి టీకాలు వేసేవారన్నారు. కాగా వ్యాక్సినేషన్ల సరఫరా కొరత కారణంగా ప్రస్తుతం కనీసం 20 మందికి కూడా టీకాలు వేస్తలేరన్నారు. రాయకోడ్లోని పీహెచ్సీని అదేవిధంగా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే మంగళవారం పరిశీలించారు.
కొవిడ్ -19 సోకిన వారిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందన్నారు. కొవిడ్ -19 పాజిటివ్ రోగులను పర్యవేక్షించే బాధ్యతను సంబంధిత సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు ఉంచాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. కరోనా సోకి ఇంట్లో ఐసోలేషన్లో ఉన్నవారు కోలుకునేంతవరకు సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యత తీసుకుని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. లేకపోతే వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.