సంగారెడ్డి : తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మణులకు అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ కేవీ రమణాచారి సూచించారు. మంగళవారం బ్రాహ్మణ పరిషత్ డైరెక్టర్ బోర్పట్ల హనుమంతాచార్య ఆధ్వర్యంలో జిల్లా బ్రాహ్మణ సంఘం నాయకులు హైదరాబాద్లోని పరిషత్ కార్యాలయంలో రమణాచారి, సముద్రాల వేణుగోపాల చారిలను కలిసి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ముఖ్యంగా పేద బ్రాహ్మణులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా స్వయం ఉపాధి, ఉన్నత, విదేశీ విద్యలకు ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. ఈ పథకాలను మరింతగా ప్రచారం చేయడంతో పాటు అర్హులకు పథకాలు అందేలా బ్రాహ్మణ సంఘం పనిచేయాలన్నారు.
కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రామారావు దేశ్పాండే, ప్రధాన కార్యదర్శి వినోద్ పటేల్, అసోసియేట్ అధ్యక్షుడు రమేష్రావు కులకర్ణి, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ కులకర్ణి, జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్రావు కులకర్ణి, సహాయ కార్యదర్శి పాండురంగారావు కులకర్ణి, పటాన్చెరు మండల అధ్యక్షుడు కె.వాసుదేవరావు, ప్రధాన కార్యదర్శి వెంకట్రావు దేశ్పాండే, సదాశివపేట మండల కోశాధికారి నరేష్దేశ్పాండే, నారాయణఖేడ్ మండల కోశాధికారి భోనాల రాధాకృష్ణ, రాంచంద్రాపురం సంయుక్త కార్యదర్శి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.