సంగారెడ్డి : జిల్లాలోని కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామంలోని ఎస్బీఐ బ్యాంకులో శనివారం రాత్రి ఓ వ్యక్తి దొంగతనానికి యత్నించాడు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. 65వ జాతీయ రహదారి పక్కనున్న దిగ్వాల్ గ్రామ ఎస్బీఐలోకి వెళ్లేందుకు ఓ వ్యక్తి కిటికీలను ధ్వంసం చేస్తుండగా పక్కనే జ్యోతిరావు ఫూలే పాఠశాల్లో నిద్రిస్తున్న వీరన్నకు శబ్దం వినిపించడంతో లేచి కేకలు వేశాడు.
దీంతో దొంగ అక్కడి నుంచి పరుగెత్తడం ప్రారంభించాడు. ఆదివారం ఉదయం ఐదు గంటల వరకు యువకులు అతడిని వెంబడించారు. అదే సమయంలో కరెంట్ పోవడం, చీకటి ఉండడంతో అతడిని పట్టుకోలేకపోయారు.
ప్రాథమిక పాఠశాల సమీపంలోని శ్మశాన వాటిక వరకు కనిపించిన దొంగ అక్కడి నుంచి ఆచూకీ దొరకలేదు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి అనుమానాస్పదంగా నిలిపిన స్కూటీని స్వాధీనం చేసుకొన్నారు. చోరీ యత్నం వివరాలను సేకరించారు. క్లూస్ టీమ్ సిబ్బంది కూడా వేలి ముద్రలను సేకరించారు.
కాగా, బ్యాంకు దొంగతనానికి యత్నించిన వ్యక్తిని వెంటనే గుర్తించిన వీరన్న, అతడి కుమారుడు రామును డీఎస్పీ శంకర్రాజు పూలమాలు, శాలువతో ఘనంగా సన్మానించారు.