జిన్నారం, నవంబర్ 22 : రోడ్లపై ఆరబోస్తున్న ధాన్యంతో వాహనదారులు మృతి చెందుతున్నారు. జిన్నారం మండలం మాదారం గ్రామానికి చెందిన గడ్డమీది శంకర్ అనే వ్యక్తి ధాన్యం కుప్పను ఢీకొని తీవ్రగాయాలపాలై మృతి చెందాడు. బొల్లారం సీఐ ప్రశాంత్, మాదారం గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..మాదారం గ్రామానికి చెందిన గడ్డమీది శంకర్(29)అనే వ్యక్తి ఆదివారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో మాదారం నుంచి కొడకంచి వైపు బైక్పై వెళ్తున్నాడు.
మాదారం గ్రామ శివారులో అదె గ్రామానికి చెందిన అరపుగూడెం యాదయ్య అనే వ్యక్తి రోడ్డుపై ధాన్యం కుప్ప చేసి దానిపై నల్లటి ప్లాస్టిక్ కవర్ను కప్పాడు. కాగా, చీకట్లో ధాన్యం కుప్ప కనిపించక బైక్ ఢీకొనడంతో శంకర్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతుడి అన్న రాజు ఫిర్యాదు మేరకు రోడ్డుపై ధాన్యం ఆరబోసిన యాదయ్యపై కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రశాంత్ తెలిపారు. మృతునికి భార్య, కూతురు ఉన్నారు.