రామచంద్రపురం, నవంబర్ 26 : పరిశ్రమలో షెడ్డు రిపేరు పనులను నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి కార్మికుడు మృతి చెందిన సంఘటన ఆర్సీపురం పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా చేర్యాలకు చెందిన మల్లేష్(53) కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
బండ్లగూడ పరిధిలోని పెన్నార్ పరిశ్రమలో షెడ్డు రిపేరు పనులను నిమిత్తం వచ్చాడు. షెడ్డుకు బోల్ట్లు అమర్చే క్రమంలో ప్రమాదవశాత్తు షెడ్డు పై నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో పరిశ్రమ యాజమాన్యం అతడిని చందానగర్లోని ఓ ప్రైవేటు దవఖానకు వైద్య సహాయం కోసం తరలించారు.
కానీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ వెంకట్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాపు చేస్తున్నారు. మృతుడు మల్లేష్కు భార్య, కుమారుడు ఉన్నారు.