సంగారెడ్డిలో ఖాళీగా ఉన్న 68 దుకాణాల భర్తీకి చర్యలు
త్వరలో చౌకధరల దుకాణాల రేషనలైజేషన్
సంగారెడ్డి, జూలై 29 (నమస్తే తెలంగాణ): కొత్త రేషన్ షాపుల ఏర్పాటుకు సర్కారు సిద్ధమవుతున్నది. ఇందుకు సంబంధించిన కసరత్తును ప్రారంభించింది. జిల్లాల వారీగా కొత్తరేషన్ దుకాణాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను తెప్పించుకుంటున్నది. సంగారెడ్డి జిల్లాలో వేర్వేరు కారణాలతో ఖాళీ అయిన 68 దుకాణాలను భర్తీ చేయనున్నది. రేషనలైజేషన్ ప్రక్రియను త్వరలో పౌరసరఫరాల శాఖ చేపట్టనున్నది.
ప్రభుత్వం రేషన్ సరుకుల కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నది. కొత్త రేషన్కార్డులు జారీ చేస్తున్న ప్రభుత్వం లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా కొత్త చౌకధరల దుకాణాలను ఏర్పా టు చేయనున్నది. ఇందుకు సంబంధించిన కసరత్తును ప్రభుత్వం ప్రారంభించింది. జిల్లాల వారీగా కొత్తరేషన్ దుకాణాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను తెప్పించుకుంటున్నది. సంగారెడ్డి జిల్లాలో కొత్త రేషన్ దుకాణాలను ఏర్పాటు చేయడంతోపాటు ఖాళీగా ఉన్న చౌకధరల దుకాణాలను భర్తీ చేయనున్నది. చౌకధరల దుకాణాల రేషనలైజేషన్ ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నది. జిల్లాలో మొత్తం 3,78,882 రేషన్కార్డులున్నాయి. ఇందులో 3,51,652 తెల్ల రేషన్కార్డులు, 27,126 అంత్యోదయ, 104 అన్నపూర్ణ రేషన్కార్డులున్నాయి. 38,701 ఆయా రేషన్కార్డులపై ప్రతినెలా 6871 మెట్రిక్ టన్నుల బియ్యం, 27126 కిలోల చక్కెర, 1,40,509 కిలోల గోధుమలు, 24వేల కిలో లీటర్ల కిరోసిన్ పం పిణీ చేస్తున్నారు. ఇదిలావుంటే ప్రభుత్వం ఇటీవల కొత్త రేషన్కార్డులను జారీ చేస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 11,281 మంది కొత్తరేషన్కార్డుల కోసం జారీ చేయగా, ప్రభుత్వం ఇందులో అర్హులైన 8,139 మంది రేషన్కార్డులను జారీ చేసింది. కొత్తరేషన్కార్డుల పంపిణీ జిల్లాలో ప్రారంభమైంది. కొత్తకార్డుల జారీతో సంగారెడ్డి జిల్లాలో రేషన్కార్డుల సంఖ్య 3,87,021 చేరుకోనున్నది. సంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీల్లో, 647 పం చాయతీల్లో రేషన్కార్డులపై సరకులు పం పిణీ చేసేందుకు మొ త్తం 845 రేషన్దుకాణాలున్నాయి. ఇందులో 177 పట్టణ ప్రాంతాల్లో ఉండగా, 668 రేషన్ దుకాణాలు గ్రామీణ ప్రాం తాల్లో ఉన్నాయి. వేర్వేరు కారణాలతో ప్రస్తుతం జిల్లాలో 68 రేషన్ దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆయా రేషన్దుకాణాల పరిధిలో ఉన్న లబ్ధిదారులు ఇతర ప్రాంతాల్లోని రేషన్ దుకాణాలకు వెళ్లి సరుకులు తీసుకోవాల్సి వస్తున్నది. ఇతర ప్రాంతాలకు వెళ్లి సరుకులు తీసుకోవడం ఇబ్బందిగా ఉం దని, తమ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న రేషన్దుకాణాలను భర్తీ చేయాలని లబ్ధిదారులు ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లడంతో రేషన్దుకాణాల ఏర్పాటుకు సిద్ధమవుతున్నది.
ఖాళీలు భర్తీ, కొత్త దుకాణాలు ఏర్పాటు
సంగారెడ్డి జిల్లాలో కొత్త రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయడంతో పాటు ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాల డీలర్ స్థానాలను భర్తీ చేయనున్నది. సంగారెడ్డి జిల్లాలో ఇటీవల వేర్వేరు కారణాలతో 68 దుకాణాలు ఖాళీ అయ్యాయి. ప్రతి మండలంలో రెండు చొప్పున రేషన్ దుకాణాలు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తున్నది. వీటిని త్వరలోనే భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదలను పౌరసరఫరాల శాఖ సిద్ధం చేస్తున్నది. అధికారుల సమాచారం మేరకు సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 20 నుంచి 30 కొత్త రేషన్ దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. ఖాళీ రేషన్ డీలర్ల భర్తీ, కొత్త రేషన్దుకాణాల ఏర్పాటుతో రేషన్కార్డు లబ్ధిదారులు ప్రయోజనం చేకూరనుంది.
రేషనలైజేషన్ దిశగా అడుగులు
సంగారెడ్డి జిల్లాలో త్వరలోనే చౌకధరల దుకాణాల రేషనలైజేషన్ చేపట్టనున్నారు. పట్టణ ప్రాం తాల్లో 800 రేషన్కార్డులు ఉన్నచోట ఒక రేషన్దుకాణం, గ్రామీణ ప్రాంతాల్లో 200 నుంచి 300 రేషన్ కార్డులు ఉన్నచోట ఒక చౌకధరల దుకాణాలను ఏర్పాటు చేశారు. పట్టణ ప్రాంతాల్లో రేషన్దుకాణాల పరిధిలో కొన్నిచోట్ల వెయ్యి నుంచి 1500 వరకు రేషన్కార్డులుంటే, మరికొన్నిచోట్ల వందల్లోనే ఉన్నాయి. ఒకే ప్రాంతంలో రెండు నుంచి మూడు రేషన్ దుకాణాలు ఉన్నాయి. దీంతో రేషన్సరుకుల పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనికితోడు రేషన్కార్డులు లబ్ధిదారులు ఎక్కడైనా సరుకలుపొందే సౌలభ్యం కల్పించడంతో కొన్ని దుకాణాల వద్ద రద్దీ ఎక్కువగా కనిపిస్తున్నది. కొన్ని దుకాణాల్లో తక్కువ సంఖ్యలో సరకులు తీసుకున్నారు. రేషన్ సరుకుల పంపిణీ అసంబద్ధంగా ఉండడంతో అన్ని ప్రాంతాల్లో సమాన సంఖ్యలో రేషన్ దుకాణాలు, సమాన సంఖ్యలో రేషన్కార్డు లబ్ధిదారులు సరుకులు పొందేలా రేషనలైజేషన్ ప్రక్రియను త్వరలో పౌరసరఫరాల సంస్థ చేపట్టనున్నది. దీంతో రేషన్ పంపిణీలో నెలకొన్న సమస్యలకు చెక్ పడనున్నది.