సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా
సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 28 : జిల్లాను క్షయ (టీబీ) రహిత జిల్లాగా మార్చాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం, జిల్లా ఫోరం, జిల్లా కో-మార్బిడిటీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాజర్షి షా మాట్లాడుతూ టీబీ రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. క్షయ వ్యాధిగ్రస్తులు ఎలాంటి భయాలు, అపోహలకు తావివ్వకుండా సకాలంలో చికిత్స పొందితే పూర్తిగా తగ్గిపోతుందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలో క్షయ పరీక్షలు చేయడం, వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు అందిస్తున్నట్లు వివరించారు. పౌష్టిక ఆహారం కోసం 6 నెలల పాటు నెలకు రూ.500 చొప్పున వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారని పేర్కొన్నారు. క్షయ వ్యాధిని అరికట్టడంలో ప్రజలు సహకరించాలని, అపోహలతో నిర్లక్ష్యానికి తావివ్వకూడదని హితవు పలికారు దగ్గు, జ్వరం రెండు వారాల కన్నా ఎక్కువగా ఉన్నా, బరువు తగ్గి, ఆకలి మందగించినా, చాతిలో నొప్పి, నీరసం, దగ్గినప్పుడు రక్తం పడటం వంటి లక్షణాలు ఉంటే కచ్చితంగా టీబీ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. విలేజ్ న్యూట్రిషన్ కమిటీ, టీబీ క్లబ్స్ ద్వారా ఆయా బృందాలు క్షయ వ్యాధిపై అవగాహన కపిస్తూ, వ్యాధిగ్రస్తులు సకాలంలో చికిత్స పొందేలా చొరవ చూపాలన్నారు. ఏపీహెచ్సీ నుంచి ఎన్ని శాంపిల్స్ వచ్చాయన్న వివరాలను నెలవారీగా అందజేయాలని సంబంధిత అధికారికి సూచించారు. పారిశ్రామిక ప్రాంతాల్లో వ్యక్తిగతంగా వెళ్లి పరీక్షలు నిర్వహించాలన్నారు. పోస్ట్ కొవిడ్ పేషంట్లలో కూడా శాంపిల్స్ తీసుకొని పరీక్షించాలని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. టీబీ వ్యాధిన పడి రోగాన్ని జయించిన కొండాపూర్ మండలం గంగారం గ్రామస్తుడు లక్ష్మీనారాయణ విజయ గాథని ఈ సందర్భంగా వివరించారు. ఈ సమావేశంలో డీఎం ఆండ్ హెచ్వో గాయత్రీదేవి, జిల్లా టీబీ అధికారి డాక్టర్ రాజేశ్వరీ, జడ్పీ సీఈ వో ఎల్లయ్య, ఎంఎన్ఆర్ వైద్యులు, రెడ్క్రాస్ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.