సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు
సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 21 : ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆసక్తి గల ఆవిష్కర్తల నుంచి నూతన ఆవిష్కరణలను ఆహ్వానిస్తున్నామని సంగారెడ్డి కలెక్టర్ ఎం. హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆన్లైన్ ద్వారా ఆవిష్కరణలను ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ఇం టింటా ఇన్నోవేటర్ ఆన్లైన్ ఆవిష్కరణల ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటిలో ఉన్న ఆవిష్కర్తలు వారి సమస్యలకు పరిష్కారం కనుగొనేలా ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఈ ప్రదర్శన ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎంపికైన ఆవిష్కర్తలకు స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆయా జిల్లాలో వారి ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు అవకాశం ఉంటుందన్నారు. సాధారణ గృహిణి మొదలుకొని అన్ని రంగాల వారు పాల్గొనేందుకు అవకాశం కల్పించామని తెలిపారు. గ్రామీణ ఆవిష్కరణలు, విద్యార్థుల ఆవిష్కరణలు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల్లో ఆవిష్కరణలు వంటి వాటిని అంగీకరించబడతాయని కలెక్టర్ వివరించారు. ఆవిష్కరణలకు సంబంధించిన ఆరు వాక్యాలు, రెండు నిమిషాల వీడియో, ఆవిష్కరణకు సంబంధించిన నాలుగు ఫొటోలు, ఆవిష్కర్త పేరు, ఫోన్ నంబర్, వయస్సు, ప్రస్తుత వృత్తి, గ్రామం, జిల్లా పేరును 9100678543 నంబర్కు ఈనెల 25లోగా వాట్సాప్ ద్వారా పంపించాలని సూచించారు. ఎలాంటి సందేహాలున్నా స్టేట్ ఇన్నోవేషన్ సెల్ నంబర్ 77990 42489, జిల్లా సైన్స్ అధికారి 9963423691 నంబర్కు ఫోన్ చేయాలని తెలిపారు. జిల్లాలోని ఆసక్తి గల ఆవిష్కర్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.