చార్మినార్, జూలై 12: వందేళ్ల చరిత్రలో ఎంతో మందిని విద్యా కుసుమాలుగా తీర్చిదిద్దిన చరిత్ర సిటీ కాలేజీ సొంతమని కళాశాల ప్రిన్సిపాల్ బాల భాస్కర్ తెలిపారు. సిటీ కాలేజీ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపాల్ బాల భాస్కర్ మాట్లాడుతూ, సిటీ కాలేజీ ఏర్పాటు చేసి వంద వసంతాలు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో వందేళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సిటీ కాలేజీ ప్రస్థానం పాఠశాల నుంచి ప్రారంభమై దశల వారీగా తన ప్రస్థానాన్ని మార్చుకుంటూ, నేడు పీజీ కాలేజీ స్థాయికి చేరిందన్నారు. సొంత ఆర్థిక వనరులు కలిగిన కాలేజీగా ఎదిగి దేశంలోనే అత్యుత్తమ కాలేజీల సరసన నిలబడిందన్నారు. అటనామస్ కాలేజీ గుర్తింపు కోసం ఈ నెల 31వ తేదీ నుంచి ఢిల్లీ యూజీసీ నుంచి ప్రత్యేక బృందం కాలేజీని సందర్శించనుందన్నారు.
ప్రస్తుతం, సిటీ కాలేజీలో 55 కోర్సులను అందిస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంతో పాటు విద్యాభ్యాసం ముగిసే నాటికి వారిలో ఉద్యోగాలను పొందేందుకు అవసరమైన అర్హతలు కలిగి ఉండేలా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రస్తుతం, సిటీ కాలేజీలో 88 మంది అధ్యాపకులు విద్యార్థులకు బోధన అందిస్తున్నారని తెలిపారు. సిటీ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న శివరాజ్ పాటిల్, శివ శంకర్, మర్రి చెన్నారెడ్డిలతో పాటు వివిధ రంగాల్లో ప్రముఖులుగా గుర్తించబడిన డాక్టర్ నాగేశ్వర్ రావు, కొంతల్ రావు, చిత్రసీమలో మాటలు, స్క్రిఫ్ట్ అందించే పరుచూరి బ్రదర్స్, ఉత్తేజ్లతో పాటు మరి కొందరిని ఈ వందేళ్ల వసంతాల ఉత్సవాలకు ఆహ్వానించనున్నామని తెలిపారు. ప్రస్తుతం, విద్యార్థుల పరీక్షా సమయం పూర్తి కావొచ్చిన తరువాత సెప్టెంబర్ మాసంలో ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ప్రిన్సిపాల్ బాల భాస్కర్ తెలిపారు. సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్స్ శుక్లాతో పాటు అయిషా సుల్తానా, అధ్యాపకులు దయానంద్, నీరజా, శ్రావణ్, పావని తదితరులు పాల్గొన్నారు.