ఆ పల్లెలో ‘ప్రగతి’ మొలకెత్తింది.. అభివృద్ధి పరుగులు పెడుతున్నది.. పల్లెప్రగతిలో చేపట్టిన పనులతో ఆ గ్రామ రూపురేఖలు మారాయి. పల్లె ప్రకృతి వనం ఆహ్లాదం పంచుతుండుగా.. వైకుంఠధామాల నిర్మాణంతో ఆఖరి మజిలీ కష్టాలు తీరాయి. ఎప్పటికప్పుడు చెత్తను డంపింగ్ యార్డులకు తరలిస్తూ స్వచ్ఛ పల్లెగా తీర్చిదిద్దారు. గ్రామంలో సీసీ రోడ్లతో సరికొత్త శోభను సంతరించుకున్నది. అంతేకాదు, నిరంతర పారిశుధ్య కార్యక్రమాలతో పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది..? జరిగిన అభివృద్ధి తెలుసుకోవాలంటే జహీరాబాద్ మండలం చెరాగ్పల్లి గ్రామానికి వెళ్లాల్సిందే..
జహీరాబాద్, జూలై 12 :ఒకప్పుడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడిన గ్రామం.. తాగడానికి నీరు కూడా ఉండేది కాదు.. వేసవి కాలం వచ్చిందంటే చాలు.. వ్యవసాయ బావుల నుంచి తాగునీటిని ట్యాంకర్లతో సరఫరా చేసేవారు. ప్రతి ఏడాది వేసవికాలంలో గ్రామస్తులు 65వ జాతీయ రహదారి పై ధర్నాలు, ఆందోళనలు చేసి అధికారులు, ప్రజాప్రతినిధులకు మొర పెట్టుకున్నా ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కష్టాలు తీరలేదు. కానీ, నేడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ మిషన్ భగీరథతో గ్రామంలోని ప్రతి ఇంటికీ తాగునీటిని అందించి తాగు నీటి కష్టం నుంచి దూరం చేశారు. తాగునీటి కష్టాలు తీరడంతో పాటు పల్లె ప్రగతిలో కార్యక్రమంలో చెరాగ్పల్లి అభివృద్ధిలో దూసుకుపోతుంది.
అభివృద్ధి వైపు పరుగులు..
ప్రతి నెలా ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులను పూర్తి చేశారు. రూ.60 లక్షలతో సీసీరోడ్లు, మురికి కాల్వలను నిర్మించారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో ఉన్న పెంటకుప్పలు, శిథిలావస్థకు చేరిన పాత ఇండ్లు, పాత బావులు పూడ్చి వేశారు. హరితహారంలో భాగంగా గ్రామంలోని రోడ్లుకు ఇరువైపులా మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు. రూ.11.20 లక్షలతో వైకుంఠధామం, రూ.2.44లక్షలతో డంపింగ్ యార్డు, రూ.3.33లక్షలతో నర్సరీ, రూ.1.42లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ.22 లక్షలతో రైతువేదిక భవనాన్ని నిర్మించారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు నిర్మించారు. ప్రభుత్వ సహకారం, గ్రామస్తుల ఐక్యతతో మౌలిక వసతులన్నీ సమకూరాయి. వీధుల్లో.. సీసీరోడ్లకు ఇరువైపులా పచ్చదనం ఉట్టిపడుతున్నది. కంపోస్టు షెడ్డు, మిషన్ భగీరథతో ఇంటింటికీ శుద్ధ్ధజలం అందుతున్నది. పాడుబడిన బావుల్ని పూడ్చుకుని, విద్యుత్ సమస్యలు తీర్చుకుని చెరాగ్పల్లి అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నది.
అన్ని వసతులతో ముందుకు…
గ్రామంలో ఎలాంటి సమస్యల్లేకుండా అన్ని వసతులతో ముందుకు సాగుతున్నాం. తాగునీటి సౌకర్యం, పారిశుధ్యంపై ప్రత్యేక చొరవ చూపడంతో గ్రామం శుభ్రంగా కనిపిస్తున్నది. గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించడంతో అభివృద్ధి సాధ్యమైంది. ప్రణాళిక ప్రకారం వార్డుల్లో ఉన్న సమస్యలు గుర్తించి, నిధులు మంజూరు కాగానే పనులు చేశాం. పల్లె ప్రగతిలో వైకుంఠ ధామం, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశాం. గ్రామాన్ని ఇతర గ్రామాలకు ఆదర్శ తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం.