నిజాంపేట, జూలై 11: సాధారణంగా వరి నాట్లు మహిళలే వేస్తుంటారు. కానీ, ఇటీవల పలు జిల్లాల్లో మగవారు నాటేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన మగ కూలీలు సాలు పద్ధతిలో యంత్రం తరహాలో నాట్లు పెడుతూ అబ్బురపరుస్తున్నారు. ఆదివారం మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని రాంపూర్లో పలువురు రైతులు తమ పొలాల్లో మగ కూలీలతో నాట్లు వేయించారు. రవాణా ఖర్చులతో కలిపి ఎకరానికి రూ.4,200 తీసుకుంటూ తక్కువ సమయంలో నాటు పూర్తిచేస్తున్నారు. కూలీల కొరత తీరడంతోపాటు డబ్బులు, సమయం ఆదా అవుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు.