న్యూఢిల్లీ:సుంకాల ఎగవేతకు పాల్పడిందన్న అనుమానంపై ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కార్యాలయాల్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ (డీఆర్ఐ) అధికారులు తనిఖీలు జరిపారు. బుధవారం దేశ రాజధాని ఢిల్లీ, ముంబై నగరాల్లోని సంస్థ కార్యాలయాల్లో తనిఖీలు మొదలయ్యాయి.
తనిఖీల్లో బయట పడిన అంశాలను డీఆర్ఐ అధికారులు వెల్లడించలేదు. తొలుత ఎక్కువగా నెట్వర్క్ కార్యకలాపాలు జరిగే ముంబైలో తనిఖీలు చేపట్టారు. ఆ తర్వాత ఢిల్లీ శివారులోని గురుగ్రామ్ ప్రాంతీయ కార్యాలయంలోనూ ఈ సోదాలు సాగాయి.
ఈ తనిఖీల్లో దక్షిణ కొరియా, ఇతర దేశాల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల్లో వాడే పరికరాల దిగుమతుల పత్రాలను డీఆర్ఐ అధికారులు పరిశీలించారు. కాకపోతే, వారు ఏమి గుర్తించారో ప్రకటించలేదు. ఈ సోదాలపై శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కూడా ఏ ప్రకటనా చేయలేదు.
ఇప్పుడు దేశీయంగా అత్యధిక 4జీ ఫోన్లను విక్రయిస్తున్న సంస్థ శాంసంగ్ కావడం గమనార్హం. ఇంకా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్కు అవసరమైన 4జీ పరికరాలను సప్లయ్ చేస్తున్నది.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఉండటంతో శాంసంగ్ తన స్వదేశం దక్షిణకొరియాతోపాటు వియత్నాం నుంచి టెలికం పరికరాలను ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేకుండా దిగుమతి చేసుకుంటున్నది.
భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లేని దేశాల్లో తయారైన నెట్వర్కింగ్ పరికరాలను దక్షిణ కొరియా, వియత్నాం మీదుగా శ్యామ్సింగ్ దిగుమతి చేసుకొంటున్నదని కేంద్రానికి సమాచారం అందింది.
ఒప్పందాలు లేని దేశాల్లో తయారైన పరికరాలపై శాంసంగ్ దిగుమతి సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది.