తమిళ హీరో సూర్య ఈ మధ్య ఎందుకో కానీ చాలా సార్లు వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు. గతేడాది తన భార్య జ్యోతికతో పాటు తన సినిమాను కూడా నేరుగా ఓటిటిలో విడుదల చేసి థియేటర్స్ యాజమాన్యంతో గొడవ పెట్టుకున్నాడు. ఆ తర్వాత కూడా రెండు మూడు సార్లు బర్నింగ్ ఇష్యూస్ మీద మాట్లాడి కాంట్రవర్సీ అయ్యాడు. ఇప్పుడు మరోసారి కూడా ఇదే జరుగుతుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ చట్టం-1952ను సవరిస్తూ తీసుకున్న నిర్ణయంపై తమిళ హీరో సూర్య అభ్యంతరాలు వ్యక్తం చేసాడు. దాంతో అధికార పార్టీ ఆయనపై మండి పడింది. బిజేపీ నాయకులు సూర్యపై ఫైర్ అవుతున్నారు.
మరోవైపు ఈ చట్ట సవరణ భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనని సూర్య అభిప్రాయపడ్డాడు. భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడటం కోసమే చట్టాలు చేయాలని.. అంతేకానీ ఉన్న స్వేచ్ఛను నాశనం చేయడానికి కాదంటూ సూర్య సీరియస్ అయ్యాడు. దాంతో ఇప్పుడు ఈ హీరోపై తమిళనాడు బీజేపీ విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తమిళనాడు బీజేపీ రాష్ట్ర యువజన కార్యవర్గం ఓ సమావేశం ఏర్పాటు చేయడమే కాకుండా అందులో సూర్యను టార్గెట్ చేసారు. తమిళనాడు బీజేపీ యువజన విభాగం కార్యదర్శి వినోద్ సెల్వం మాట్లాడుతూ సూర్యను సినిమాలు మాత్రమే చేసుకోవాలని సూచించాడు.
ఈ మీటింగ్ తర్వాత సూర్యకు వార్నింగ్ కూడా ఇచ్చారు వాళ్లు. సూర్యకు రాజకీయాలతో అవసరం లేదని.. కేవలం తన సినిమాలు మాత్రమే చేసుకుంటే మంచిదని వాళ్లు చెప్పారు. ఇతర విషయాలపై అనవసర జోక్యం.. తప్పుడు ప్రచారాలు మానుకోవాలని సూచించారు. అలా కాదని ఇలాగే రెచ్చిపోతే సూర్యపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీజేపీ యువజన విభాగం నేతలు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఈ వార్నింగ్ పై సూర్య ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.