సిటీబ్యూరో, జూలై 5(నమస్తే తెలంగాణ) : మొబైల్ దుకాణంలో జరిగిన చోరీ కేసును రాచకొండ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. సాగర్ రింగ్రోడ్డు నిర్మాణ పనుల నిమిత్తం పశ్చిమబెంగాల్ నుంచి వచ్చిన కూలీలే ఈ చోరీకి పాల్పడ్డారు. ఎల్బీనగర్లోని రాచకొండ పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్కు చెందిన మహ్మద్ తస్లీమ్, మహ్మద్ జాసిముద్దీన్, రఫిక్ ఉల్ షేక్లు కూలీ పనుల నిమిత్తం నగరానికి వచ్చారు. నగరశివారులో చేపడుతున్న సాగర్ రింగ్రోడ్డు నిర్మాణ పనుల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. వీరికి నిర్మాణ సంస్థ ప్రతి నెలా రూ.15వేలు వేతనం ఇస్తున్నది. అయితే మద్యానికి అలవాటు పడిన వీరికి డబ్బులు సరిపోకపోవడంతో తస్లీమ్ చోరీలు చేద్దామని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని రఫీక్, జాసిముద్దీన్లకు చెప్పి ఒప్పించాడు. దీంతో గత నెల 30న అర్ధరాత్రి దాటిన తర్వాత ఎల్బీనగర్ చౌరస్తాలోని ట్రూ వాల్యూ మొబైల్ షాపు గోడకు రంధ్రంచేసి లోపలికి ప్రవేశించారు. దుకాణంలో ఉన్న 26 మొబైల్ ఫోన్లు, హెడ్ ఫోన్స్, చార్జర్లు, కనెక్టర్లు, బ్లూటూత్, బ్యాటరీలను చోరీ చేశారు. జూలై 1న ఫిర్యాదు నమోదు కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు రింగ్రోడ్డు ఫ్లైఓవర్ పనులు నడుస్తున్న చోట ఆరా తీశారు.
నిందితులు రైలులో పశ్చిమబెంగాల్లోని మాల్దా వెళ్తున్నారని గుర్తించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. ఓ బృందాన్ని విమానంలో కోల్కతాకు పంపారు. సాంకేతిక ఆధారాలతో దొంగలు ప్రయాణిస్తున్న రైలును గుర్తించి ఖరగ్పూర్లో పశ్చిమ బెంగాల్ జీఆర్పీ ఎస్పీ పుష్ప సహాయంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం నగరానికి తీసుకువచ్చి రిమాండ్కు తరలించారు. వారి నుంచి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన క్రైం డీసీపీ యాదగిరి, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి, సీసీఎస్ ఏసీపీ శేఖర్రెడ్డి, సీఐలు వెంకటేశ్వర్లు, మహేశ్, అశోక్రెడ్డి, ఎస్ఐ ఫజీయుద్దీన్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్రెడ్డిల బృందాన్ని సీపీ ప్రత్యేకంగా అభినందించారు.