పురాతన భవనాల కూల్చివేత, ఇండ్ల మరమ్మతుల సమయంలో వ్యర్థాలు పోగవుతుంటాయి. వీటిని ఏం చేయాలో తెల్వక చాలామంది గుట్టుచప్పుడు కాకుండా చెరువుల వద్ద, రోడ్ల వెంట పారబోస్తారు. దీన్ని నియంత్రించేందుకు బల్దియా తక్కువ రుసుముతో ఇంటి నుంచే వ్యర్థాల సేకరణ ప్రారంభించింది. ఇలా సేకరించిన వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేందుకు ఆధునిక హంగులతో జీడిమెట్లలో ప్లాంట్ ఏర్పాటు చేయగా, రెండోది నాగోలు సమీపంలోని ఫతుల్లాగూడ వద్ద నిర్మించారు. నిత్యం 500 టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే ఈ అధునాతన ప్లాంట్ను శుక్రవారం పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. వెబ్ ప్రాసెసింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ ప్లాంట్లో దుమ్ము, ధూళి బయటకు రాకపోవడం దీని ప్రత్యేకత.
ఫతుల్లాగూడ ప్లాంట్లో నిత్యం 500 టన్నుల నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తారు. దీనిద్వారా వచ్చిన సన్న ఇసుక, దొడ్డు ఇసుక, కంకర, రాయి, ఇటుకలను వేరుచేసి పేవర్బ్లాక్స్, పార్కింగ్ టైల్స్, ఫుట్పాత్ టైల్స్ వంటివి తయారు చేస్తారు. ఈ టైల్స్ అత్యంత నాణ్యమైనవి. ధర కూడా బయటతో పోల్చితే 30 శాతం తక్కువ. ఈ సామగ్రిని ఫుట్పాత్, ఫ్లోరింగ్ పనుల్లో వినియోగిస్తారు.
నగరంలో నిత్యం దాదాపు 2 వేల టన్నులకుపైగా నిర్మాణ వ్యర్థాలు వెలువడుతుంటాయి. వీటిని ఎక్కడపడితే అక్కడ పారబోయకుండా జీహెచ్ఎంసీ ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసింది. టన్ను వ్యర్థానికి రూ.342 చెల్లిస్తే ఇంటి వద్దకే వాహనం వచ్చి తీసుకెళ్లుతుంది.