సిటీబ్యూరో, జూన్ 24 ( నమస్తే తెలంగాణ ) :చూడముచ్చటగా చిందేసే బొమ్మలు.. చూపరులను ఆకట్టుకునే బహుమతులు.. ఇంటికి అందాన్ని అద్దే అలంకరణలు.. స్వచ్ఛమైన చేనేతలు.. విభిన్న వృత్తుల తాలుక ఉత్పత్తులు.. సువాసనలు వెదజల్లే గంధపు చెక్కుళ్లు.. చూడగానే కొనాలనిపించేలా మనసును ఒప్పించే కళా రూపాలు.. అమ్మాయిలు ఇష్టపడే జ్యువెల్లరీ.. ఎలక్ట్రిక్ పరికరాలు అమర్చుకునే బ్యాగ్స్.. రంగు రంగుల మాస్కులు.. వెరసి గోల్కొండ హ్యాండీ క్రాఫ్ట్స్కు విశేష ఆదరణ లభిస్తున్నది. కళాకారుల నైపుణ్యానికి అద్దం పడుతున్న ఈ ఉత్పత్తులకు నగరవాసుల నుంచి ఎన్ఆర్ఐల వరకు జై కొడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వివిధ ప్రాంతాల వృత్తులకు జీవం పోయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఎంపోరియాలు నగరవాసుల షాపింగ్కు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నాయి. కరోనా పరిస్థితుల్లోనూ ఆన్లైన్ అమ్మకాల జోరు సాగుతున్నది.
బంజారాహిల్స్లోని గోల్కొండ హ్యాండీ క్రాఫ్ట్స్ ఎంపోరియంలో మిర్రర్ లేడీ కళారూపం ఎంతగానో ఆకట్టుకుంటున్నది. ద్వారంలో కొలువుదీరిన ఆ బొమ్మ రూ. 2.50 లక్షలు పలుకుతున్నది. నడుము ఓవైపునకు వంచి మెలిక తిరిగిన భంగిమలో చేతిలో అద్దం పట్టుకుని.. మరో చేతిలో కుంకుమ భరిణి ..అద్దంలో చూసుకుంటూ.. మురిసిపోతున్న ఆ అతివ కళాఖండం చూపరులను కట్టిపడేస్తున్నది. వైట్వుడ్తో చెక్కిన ఈ అద్భుత రూపం మైసూర్ నుంచి దిగుమతి అయింది. అంతేకాకుండా గంధం చెక్కతో తయారు చేసిన నిర్మాణాలు లక్షల ధరలు పలుకుతున్నాయి. ఏనుగుల గుంపు, బుద్ధుడు తదితర రూపాలు కూడా లభిస్తున్నాయి. దీంతో పాటు స్వచ్ఛమైన గంధం బొట్టును అందించే గంధం చెక్కలు, సానబెట్టే రాయిలతో అమ్మకానికి ఉన్నాయి. తాంజావూర్ నుంచి వచ్చిన బొమ్మలు, పెయింటింగ్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సిల్క్ దారంతో రూపొందించిన నెమలి బొమ్మ, నిర్మల్ కొంగ ప్రత్యేక ఆకర్షణగా ఉంది.
అబిడ్స్, ఆర్టీసీ క్రాస్రోడ్డు, బంజారాహిల్స్ గోల్కొండ హ్యాండీ క్రాఫ్ట్స్ ఎంపోరియాలు తెలంగాణ, రాజస్థాన్, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, జమ్మూకశ్మీర్ తదితర రాష్ర్టాల వృత్తుల ఉత్పత్తులు కనుమరుగవకుండా కాపాడుతున్నాయి. పెట్టిన ధరకు తగ్గట్టు ఉత్పత్తులు లభిస్తున్నాయి. ముఖ్యంగా నిర్మల్ బొమ్మలు, ఆదిలాబాద్ ట్రైబల్ ఉత్పత్తులు, వరంగల్ పెయింటింగ్స్, సిద్దిపేట, పోచంపల్లి, నారాయణపేట్ చేనేత వస్ర్తాలు, కొండపల్లి బొమ్మలు, ఆగ్రా గిఫ్ట్స్, వుడ్ కార్వ్, గన్ మెటల్స్, మార్బెల్లెదర్, డోక్రా, బిద్రీ, స్వచ్ఛమైన సిల్వర్తో తయారు చేసిన అలంకరణ వస్తువులు, పేపర్తో రూపొందించిన ఆకృతుల వంటివి కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రూ. 30 నుంచి రూ. 5 లక్షల విలువజేసే వస్తువులు ఇక్కడ కొలువు దీరాయి.
కరోనా పరిస్థితుల కారణంగా నేరుగా వెళ్లి విక్రయించలేని వారి కోసం ఆన్లైన్లోనూ గోల్కొండ ఉత్పత్తులు అందుబాటులో ఉంచారు. ఫ్లిప్కార్ట్, ఈ- గోల్కొండ, షాపీ 5, బంజారాహిల్స్ గోల్కొండ ఎంపోరియం తదితర వాటిలో షాపింగ్ చేయొచ్చు. రోజుకు సుమారు లక్ష రూపాయల వరకు ఆన్లైన్ అమ్మకాలు జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఎన్ఆర్ఐలు నగరానికి వస్తే తప్పకుండా గోల్కొండ స్టోర్ను సందర్శిస్తారని వెల్లడించారు. ప్రస్తుతం కొవిడ్ పరిస్థితుల కారణంగా వారి రాకపోకలు తగ్గినట్లు చెబుతున్నారు. కరోనాకు ముందు రోజుకు సుమారు రూ. 25 లక్షల అమ్మకాలు జరిగేవని పేర్కొన్నారు.
మానవ ఆధారిత ఉత్పత్తులకు ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. స్వయంగా అన్నీ వృత్తుల వారు రూపొందించిన బొమ్మలు, అలంకరణ వస్తువులు, చేనేత దుస్తులు ఇలా అన్ని రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్లో ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఆయా రాష్ర్టాల్లో ప్రాచుర్యం పొందిన వృత్తుల ఉత్పత్తులు మా స్టోర్లో లభిస్తాయి. అరుదైన ఫర్నిచర్ దొరుకుతున్నది. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈ వస్తువుల ప్రాధాన్యత మరింత పెరిగింది. డిస్కౌంట్స్లు కూడా అందుబాటులో ఉన్నాయి.-కేవీఎస్ నాగేశ్వరరావు, మేనేజర్, గోల్కొండ హ్యాండ్లూమ్ ఎంపోరియం, బంజారాహిల్స్.