నారాయణఖేడ్, జూన్ 21: కాల్వకు కాలు అడ్డం పెడితే నీరు పారాలే.. ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరందించిన విధంగా ప్రతి పొలానికి సాగు నీరందించడమే బసవేశ్వర ఎత్తిపోతల పథకం లక్ష్యమని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా మనూరు మండలం బోరంచ శివారులో ‘బసవేశ్వర ఎత్తిపోతల పథకం’ సర్వే పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 8 టీఎంసీల జలాలను మూడు పంప్హౌస్ల ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఆరు మండలాలతో పాటు అందోల్ నియోజకవర్గంలోని రేగోడ్, వట్పల్లి మండలాల్లోని ప్రధాన చెరువులను అనుసంధానిస్తూ 1.65 లక్షల ఎకరాలకు సాగునీరందనుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను 19, 19ఏ ప్యాకేజీలో భాగంగా అదనంగా మరో 40వేల ఎకరాలకు తరలించనున్నట్లు చెప్పారు. రైతుల జీవితాల్లో వెలుగులు నింపి వారి తలరాతను మార్చే చారిత్రక సందర్భంగా మంత్రి అభివర్ణించారు.
ఆషామాషీ వ్యవహారం కాదు…
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కంగ్టికి జలాలను తరలించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదని, 550 మీటర్ల ఎత్తున్న కంగ్టి మండలానికి సాగునీటిని తరలించి బీడు భూములను సైతం సస్యశ్యామలం చేస్తామని మంత్రి హరీశ్రావు అన్నారు. కలలో కూడా ఊహించని రీతిలో ప్రతి ఎకరాకు సాగునీరిచ్చి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వాళ్లకు వ్యవసాయం రాదని వెక్కిరించిన ఆంధ్రోళ్లే నోరెళ్లబెట్టే విధంగా ఒక్క సిద్దిపేట జిల్లాలోనే యాసంగిలో 5.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించినట్లు వెల్లడించారు. తెలంగాణ వస్తే నీరు, నిధులు వస్తాయనే ప్రజల ఆకాంక్షలను సాకారం చేస్తూ సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడంతో పాటు రైతుబంధు వంటి పథకాలను అమలు చేసుకుంటున్నామని తెలిపారు.
ఆ పార్టీలకు సమస్యలు పట్టవు…
నారాయణఖేడ్లో 10 సార్లు కాంగ్రెస్ను గెలిపించిన ప్రజలకు దక్కింది నులక మంచం మీద స్నానం చేసే దుస్థితేనని మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఎన్నికలప్పుడు మాత్రమే మాట్లాడే కాంగ్రెస్, బీజేపీ నాయకులు, ప్రజల సమస్యలను తీర్చేదిశగా ఒక్క మంచి పని చేయలేదన్నారు. రైతుల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వమని, రైతుబీమా పథకం ద్వారా మృతి చెందిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం ఇచ్చే కార్యక్రమం ఈ భూమి మీద కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అమలు చేస్తున్నదన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గానికి రైతుబంధు పథకం ఒక గొప్ప వరమని, ఈ పథకం ద్వారా ఈ నియోజకవర్గానికి ఏటా రూ.220 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయన్నారు. భూముల రిజిస్ట్రేషన్లను సరళీకృతం చేస్తూ ధరణి పోర్టల్ను అందుబాటులోకి తెచ్చామని, త్వరలో వ్యవసాయ భూముల సర్వే చేపట్టి వివాదా లు లేకుండా చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్ది, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, అదనపు కలెక్టర్ రాజర్షిషా, నీటిపారుదలశాఖ సీఈ అజయ్కుమార్, ఈఈ జైభీమ్, ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్, మనూరు ఎంపీపీ జయశ్రీరెడ్డి, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, స్థానిక సర్పంచ్ రేణుక పండరి, ఎంపీటీసీ రాములు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఈ జన్మకు ఇది చాలు…
ఆదివారం రాత్రి తన కారు ప్రమాదానికి గురైన సందర్భంగా ఎంతోమంది తనకు ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకున్నారని, ఎక్కడో మారుమూలన ఉన్న కంగ్టి మండలం సర్దార్ తండాకు చెందిన మాజీ సర్పంచ్ చిమ్నీబాయి కూడా తనకు ఫోన్ చేసి ప్రమాదం గురించి ఆరా తీసి ‘సార్ మా తండాలోని కాళుబాబా ఆశీస్సులు ఎప్పుడూ మీ వెంట ఉంటాయి, మీకు ఏమి కాదు సార్’ అని భరోసా ఇచ్చిందని, ప్రజలు తనపై ఇంతటి ప్రేమాభిమానాలు చూపడం తనకెంతో ఆనందం కలిగించిందని, ఈ జన్మకు ఇది చాలని మంత్రి హరీశ్రావు అన్నారు.
పత్తి, కంది వేయాలి…
ఈసారి పత్తి, కంది పంటపై రైతులు ఆసక్తి చూపాలన్న మంత్రి హరీశ్రావు, వెదజల్లే పద్ధ్దతిలో వరిని సాగుచేసుకోవాలని సూచించారు. సర్వే పనులు సమర్థవంతంగా పూర్తయి బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభమైతే బోరంచ నల్లపోచమ్మ తల్లికి ముక్కుపుడక పెడతానని మొక్కుకున్నట్లు మంత్రి తెలిపారు. మూడు నెలల్లోగా బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను పూర్తి చేయడం ద్వారా డీపీఆర్ నివేదిక ఆధారంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పనులను ప్రారంభించుకుందామన్నారు. నల్లవాగు ప్రాజెక్టు ఎల్లప్పుడూ నిండుకుండలా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎల్లప్పుడూ జనం మధ్య ఉండే జనం మనిషి స్థానిక ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
మాట నిలబెట్టుకుంటున్న మంత్రి.. మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి
తనకు సిద్దిపేట, నారాయణఖేడ్ రెండు కండ్లు అని, సిద్దిపేటతో సమానంగా నారాయణఖేడ్ను అభివృద్ధి చేస్తామని ఉప ఎన్నికల సందర్భంలో ఇచ్చిన మాటను మంత్రి హరీశ్రావు నిలబెట్టుకుంటున్నారని శాసన మండలి ప్రొటెం చైర్మన్ వి.భూపాల్రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మంత్రి హరీశ్రావు ఆసక్తికి తగిన విధంగా స్థానిక ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అహర్నిశలు కృషిచేస్తున్నారని కొనియాడారు. 650 మీటర్ల ఎత్తు నుంచి గోదావరి జలాలను బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గానికి సాగునీరందించే ప్రణాళిక ఎంతో గొప్పదని కొనియాడారు.
శాశ్వత పరిష్కారం దొరికింది.. జడ్పీ చైర్పర్సన్ మంజూశ్రీ జైపాల్రెడ్డి
తరతరాలుగా సాగునీటి కోసం అల్లాడుతున్న నారాయణఖేడ్ నియోజకవర్గ రైతాంగానికి బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా శాశ్వత పరిష్కారం దొరికిందని జడ్పీ చైర్పర్సన్ మంజూశ్రీ జైపాల్రెడ్డి అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆకలి చావులు, రైతు ఆత్మహత్యలు తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదని, సీఎం కేసీఆర్ మాత్రం సాగు సంస్కరణలు చేపట్టి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.
రైతుల జీవితాల్లో మార్పులు.. ఎంపీ బీబీ పాటిల్
బసవేశ్వర ఎత్తిపోతల పథకంతో నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల రైతుల జీవితాల్లో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయని జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ ఆకాంక్షించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో అత్యధిక శాతం ఆయకట్టుకు సాగునీరందే అవకాశం ఉందని, దీంతో రైతుల జీవన ప్రమాణాలు పెంపొందుతాయన్నారు. రైతుల విషయంలో ఎక్కడా రాజీపడకుండా కరోనా సంక్షోభ సమయంలోనూ రైతుబంధును అమలు చేయడం, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆదుకుంటున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
బసవేశ్వరతో వలసల నివారణ : నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి
నారాయణఖేడ్ నియోజకవర్గ రైతుల సాగునీటి సమస్యను తీర్చే దిశగా బసవేశ్వర ఎత్తిపోతల పథకం రూపుదిద్దుకోవడం ఒక అద్భుతమైతే, సర్వే పనులను ప్రారంభించడం ఒక చారిత్రక ఘట్టమని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. ఈ పథకంతో వలసలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రి హరీశ్రావు సహకారంతో నారాయణఖేడ్ నియోజకవర్గంలో నీటిపారుదల రంగంలో ఎంతో పురోగతి సాధించామన్నారు. మిషన్ కాకతీయలో భాగంగా రూ.80 కోట్లతో అన్ని చెరువులను మరమ్మతు చేసుకోగా, కొత్తగా ఎనిమిది చెరువులను నిర్మించుకోబోతున్నామని తెలిపారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఆ పార్టీ నాయకులు నల్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనుల పేరిట మంజూరైన రూ.14 కోట్ల నిధులను పక్కదారి పట్టిస్తే, మంత్రి హరీశ్రావు చొరవతో రూ.25 కోట్లు మంజూరు చేయించి పనులు చేపట్టి ఆయకట్టును స్థిరీకరించినట్లు చెప్పారు. విద్య, వైద్యం విషయంలో నియోజకవర్గం ఎంతో పురోగతి సాధించిందని, భవిష్యత్లోనూ ఇదే తరహా సహకారం అందించి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని మంత్రిని కోరారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే, సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావులకు కృతజ్ఞతలు తెలిపారు.
రెండు నియోజకవర్గాలు సుభిక్షం .. అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్
బసవేశ్వర ఎత్తిపోతల పథకంతో నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాలను పట్టి పీడిస్తున్న శని వదిలి సుభిక్షం కానున్నాయని అందోల్ ఎమ్మెల్యే చంటి కాంత్రికిరణ్ అన్నారు. వర్షం కురిస్తే తప్ప పంట పెట్టే పరిస్థితి లేని ఈ ప్రాంతంలో, ఈ పథకం ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారనడానికి ఇంత పెద్దఎత్తున సాగునీరందించే పథకాన్ని రూపొందించండమే ఒక నిదర్శనమని కొనియాడారు. సాగునీటి విషయంలో వెనుకబడిన నారాయణఖేడ్ నియోజకవర్గ రైతులకు ఈ పథకంతో ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.