మన్సూరాబాద్, జూన్ 18: తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో నుంచి సుమారు రూ.40లక్షల విలువైన వజ్రాలు, జాతిరత్నాలను అపహరించుకుపోయిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ అశోక్రెడ్డి కథనం ప్రకారం.. విజయవాడ జిల్లా సూర్యారావు పేటకు చెందిన బెల్లంకొండ మురళీకృష్ణ (38) ప్రస్తుతం ఎల్బీనగర్, నాగోల్, ఆనంద్నగర్ కాలనీలో నివాసముంటూ.. వజ్రాల వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపార లావాదేవీల నిమిత్తం నాగోల్లోని శివశంకర్కాలనీలో మరో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అక్కడి నుంచే వ్యాపారం కొనసాగిస్తుంటాడు. ఈనెల 10న ముంబాయికి వెళ్లిన మురళీకృష్ణ విలువైన వజ్రాలు కొనుగోలు చేసుకుని ఈనెల 11న నగరానికి వచ్చి శివశంకర్కాలనీలోని తన అద్దె ఇంట్లో వాటిని భద్రపరిచాడు.
తన వద్దకు వచ్చిన వ్యాపారులకు కొన్ని వజ్రాలు, జాతిరత్నాలను విక్రయించి ఆదర్శనగర్లోని తన నివాసానికి వెళ్లాడు. అతడు వెళ్లిన అనంతరం ఇంట్లో పనిచేసే సుజాత మెయిన్గేటుకు తాళం వేసి ఆమె తన ఇంటికి వెళ్లి పోయింది. ఈనెల 15న రాత్రి 10:30 గంటల సమయంలో పనిమనిషి సుజాత భర్త వజ్రాల వ్యాపారి మురళీకృష్ణ వ్యాపార నిమ్తితం తీసుకున్న అద్దె ఇంటి వద్ద నుంచి వెళ్తున్నాడు. ఇంట్లో లైట్లు వెలుగుతున్నట్లు గమనించి తన భార్య సుజాతకు తెలియజేశాడు. వెంటనే ఆమె మురళీకృష్ణకు సమాచారం ఇచ్చింది. మురళీకృష్ణ తన మిత్రుడితో కలిసి శివశంకర్కాలనీలోని తన కార్యాలయానికి వచ్చి బెడ్రూమ్లో భద్రపరిచిన వజ్రాలు, జాతిరత్నాల కోసం గాలించాడు. సుమారు రూ.40 లక్షల విలువైన వజ్రాలు, జాతిరత్రాలు అపహరణకు గురైనట్లు గ్రహించిన ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.