ఆస్తులపై ఉన్న ప్రేమ అభివృద్ధిపై లేదు : ఈటలపై గంగుల ఫైర్
హుజూరాబాద్, జూన్16: ‘ఆస్తులపై ఉన్న ప్రేమ నీకు అభివృద్ధిపై లేదు.. నీ వైఫల్యంతోనే హుజూరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడింది.. నోరుతెరిస్తే ఆత్మగౌరవం అంటున్న నువ్వు.. ఎన్ని కోళ్లు అమ్మి ప్రత్యేక విమానంలో ఢిల్లీ పోయినవ్?’ అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ను బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అభివృద్ధిపై చర్చించి, మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాలు అభివృద్ధిలో వెనుకబడిపోవడం కేవలం ఈటల వైఫల్యమేనని ఆరోపించారు. ఆరు దఫాలుగా గెలిచిన రాజేందర్ను మరోసారి గెలిపిస్తే పాత కథే పునరావృతం అవుతుందని చెప్పారు. కేవలం ఈటల నిర్లక్ష్యంతోనే మిషన్ భగీరథ నీళ్లు రెండు పట్టణాల్లో సరఫరా కావట్లేదని దుయ్యబట్టారు. హుజూరాబాద్లో ఎటుచూసినా దుమ్ము, దూళితో రోడ్లు కనిపిస్తున్నాయన్నారు. ప్రభుత్వంలో ఉండి నిధులు తెచ్చుకోలేని ఈటల.. బీజేపీలో చేరి నిధులు ఎలా తెస్తారని ప్రశ్నించారు. ఢిల్లీలో చెట్ల కింద హుజూరాబాద్ ప్రజలకు బీజేపీ కండువా కప్పించి ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. హుజూరాబాద్ పట్టణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.35 కోట్లు విడుదల చేసినట్టు గంగుల వెల్లడించారు. హుజూరాబాద్ మున్సిపాల్టి పరిధిలోని 13 వార్డు కౌన్సిలర్ కొండ్ర జీవిత ఆధ్వర్యంలో సమారు 50 మంది ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.