వరంగల్ : జిల్లాలోని ధర్మసాగర్ గ్రామంలో సోమవారం ఓ వ్యక్తిని తన ప్రత్యర్థులు దారుణంగా కొట్టి చంపారు. మృతుడిని ఎస్సీ కాలనీకి చెందిన చింతా అశోక్(35)గా గుర్తించారు. రేషన్ దుకాణానికి సరుకులు తీసుకుని వెళ్లేందుకు వచ్చిన అశోక్ను షాపు సమీపంలో ఇద్దరు వ్యక్తులు కర్రలతో విచక్షణా రహితంగా కొట్టారు. తీవ్ర రక్తస్రావమై అశోక్ సంఘటనా స్థలంలోనే చనిపోయాడు. మృతుడికి భార్య, ముగ్గురు కొడుకులు, ఓ కుమార్తె ఉన్నారు. కాజీపేట ఏసీపీ రవీందర్ కుమార్, ధర్మసాగర్ ఇన్స్పెక్టర్ రమేశ్ కుమార్, ఇతర పోలీసు సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పాతకక్ష్యలే ఇందుకు కారణంగా పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేశారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.