మొన్నటిదాకా బీజేపీని విమర్శించిన నీవు ఎట్ల చేరుతవ్?
వ్యక్తులు అవసరం లేదు.. వ్యవస్థ ముఖ్యం
హుజూరాబాద్పై సీఎం ప్రత్యేక దృష్టి
అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందాం
వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్
జమ్మికుంటలో పర్యటన. సమీక్షా సమావేశాలు
జమ్మికుంట, జూన్ 12: మతాల మధ్య చిచ్చుపెట్టే బీజేపీలో ఈటల చేరబోతున్నాడని, అలాంటి మతతత్వ పార్టీలో చేరే ‘ఈటల’కు ఇక్కడ స్థానం లేదని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పేర్కొన్నారు. నాడు మంత్రిగా నల్ల చట్టాలు, టీకాల వ్యవహారంపై బీజేపీని విమర్శించిన తీరును మరిచిపోయావా..? కమ్యూనిస్టు భావజాలం ఉన్న నీవు బీజేపీలో ఎలా చేరుతావని ప్రశ్నించారు. జమ్మికుంట మండలం కోరపల్లి, వెంకటేశ్వర్లపల్లి, పాపయ్యపల్లి, విలాసాగర్, సైదాబాద్, తనుగుల, శంభునిపల్లి, గండ్రపల్లి గ్రామాల్లో శనివారం పర్యటించారు. ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పార్టీలో అనేక పదవులు అనుభవించిన ఈటల, దుర్భుద్దితో బీజేపీకి మారుతున్నాడని విమర్శించారు.
వ్యక్తులు ప్రధానం కాదని, వ్యవస్థ మాత్రమే ముఖ్యమని తేల్చిచెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమం దూసుకుపోతున్నదని, బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఈ పరిస్థితి లేదన్నారు. అభివృద్ధి ఆగదని, సమస్యలు పరిష్కరిస్తామని, పెండింగ్ పనులన్నీ పూర్తి హామీ ఇచ్చారు. సీఎంఆర్ఎఫ్, అనారోగ్య సమస్యలుంటే తెలియజేయాలని, దగ్గరుండి పరిష్కరిస్తానని చెప్పారు. అంతకుముందు ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు అందించిన సలహాలు, సూచనలు, సమస్యలు, అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. అన్నింటికీ పార్టీ ఉందని, ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, వరంగల్ డీసీబీబీ చైర్మన్ రవీందర్రావు, ఎంపీపీ మమత, జడ్పీటీసీ డాక్టర్ శ్యాం, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షురాలు మమత, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు లింగారావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.