చార్మినార్, జూన్ 9 : జూలో అత్యధిక వయస్సు కలిగిన ఏనుగు బుధవారం తుదిశ్వాస విడిచింది. నగరంలోని నెహ్రూ జంతుప్రదర్శనశాలలో ఉన్న ఏనుగు రాణి (84) దేశంలోనే అత్యధిక వయస్సు కలిగినదిగా గుర్తించబడింది. పబ్లిక్గార్డెన్లో కొనసాగిన జూ పార్కు.. 1963 అనంతర కాలంలో ప్రస్తుతం కొనసాగుతున్న జూ పార్కుకు తరలించారు. రాణి జన్మదిన వేడుకలను ప్రతి సంవత్సరం జూ అధికారులు ఘనంగా నిర్వహించేవారు. జూను సందర్శించే పర్యాటకులు ఏనుగుల ఎన్క్లోజర్ వద్దకు వచ్చినప్పుడు తన విన్యాసాలతో అలరించేది. రాణి మృతి పట్ల ప్రతి రోజు ఎన్క్లోజర్లో విధులు నిర్వహించే సిబ్బంది కంటతడిపెట్టారు. అధికారులు రాణి సేవలను స్మరించికుంటూ నివాళుర్పించారు. ఏనుగుల జీవిత కాలం 60 ఏళ్లవరకు మాత్రమే ఉంటుందని జూ అధికారులు తెలిపారు. జూలోని ప్రత్యేక పరిస్థితులు, వాటికి అందించే ఆహారంతోపాటు నిత్యం జంతువులు వైద్యుల పర్యవేక్షణలో కొనసాగుతున్న నేపథ్యంలో జూలో జంతువులు వాటి జీవనాన్ని మెరుగుపర్చుకుంటూ జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. రాణి వయస్సు రిత్యా ఏర్పడిన అనారోగ్య సమస్యల వల్ల మరణించినట్లు జూ పార్కు అధికారులు తెలిపారు. రాణిని గత సంవత్సరం అపోలో ఆసుపత్రి వైస్ చైర్మన్ ఉపాసన సంవత్సరం పాటు దత్తత తీసుకుని పోషిస్తున్నారు. రాణి మృతి పట్ల జూ మాజీ అధికారులు సైతం రాణి సేవలను గుర్తు చేసుకున్నారు.
జూలోని చిరుత (21) సైతం బుధవారం రాత్రి మృతి చెందినట్లు జూ పార్కు వెటర్నరీ వైద్యులు వెల్లడించారు. 21 సంవత్సరాల వయస్సున్న చిరుత వయస్సురిత్యా ఏర్పడిన అనారోగ్య సమస్యలతో మృతి చెందినట్లు తెలిపారు. జంతుమార్పిడిలో భాగంగా చిరుత (అయ్యప్ప)ను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూ పార్కు నుంచి నగరానికి తరలించామని తెలిపారు. చిరుతలు సహజంగా అడవుల్లో 15 నుంచి 18 ఏళ్లపాటు మనుగడ సాగిస్తాయని..జూ పార్కులో ప్రత్యేకమైన ఆహారాన్ని అందించడంతోపాటు మెరుగైన వైద్యసేవలను ఎప్పటికప్పుడు అందించే క్రమంలో జూలోని జంతువులు ఆరోగ్యంతోపాటు పూర్తి జీవితకాలాన్ని కొనసాగిస్తాయని తెలిపారు.